MS Dhoni : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. తమ అభిమాన క్రికెటర్ల బ్యాటింగ్ విన్యాసాలను ఎప్పుడెప్పుడు చూస్తామా అని అంతా ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ సీజన్తో భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్కు గుడ్ బై చెప్పనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్కు చేరకుంటే ధోనీ మే 14న సీఎస్కే తరఫున ఆఖరి మ్యాచ్ ఆడేసినట్టే. అవును.. సొంత గ్రౌండ్ చెపాక్ స్టేడియంలో ఈ దిగ్గజ క్రికెటర్ ఆఖరి మ్యాచ్ ఆడనున్నాడు.
ఆ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్తో సీఎస్కే తలపడనుంది. ఈ విషయాన్ని సీఎస్కే అధికారి ఒకరు వెల్లడించాడు. ఇన్సైడ్స్పోర్ట్తో అతను మాట్లాడుతూ.. ‘ఇది ధోనీ ఆఖరి ఐపీఎల్. అయితే.. మరో సీజన్ ఆడాలా? వద్దా? అనేది ధోనీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటివరకైతే అతను రిటైర్ అవుతున్నట్టు మేనేజ్మెంట్కు చెప్పలేదు. మళ్లీ ఐపీఎల్ చెన్నైకు రావడం అనేది సీఎస్కే అభిమానులకు ప్రత్యేకమైన విషయం. ఒకవేళ ధోనీ ఆఖరి సీజన్ ఆడితే అది చాలా బాధాకరం’ అని అతను వెల్లడించాడు.
నాలుగు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ పోయిన ఏడాది నిరాశ పరిచింది. ఆఖరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. సీజన్ మధ్యలో ఆ జట్టు కెప్టెన్ను మార్చడం కూడా విమర్శలకు దారి తీసింది. రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ అప్పగించిన సీఎస్కే ఆ తర్వాత నిర్ణయం మార్చుకుంది. మళ్లీ ధోనీకి పగ్గాలు అందించింది. దాంతో, జడేజా అసహనానికి గురయ్యాడని, అతను ఆ ఫ్రాంఛైజీని వీడతాడనే వార్తలు వినిపించాయి. కానీ, అలా జరగలేదు. జడ్డూ ఈ సీజన్లోనూ అదే జట్టుకు ఆడనున్నాడు.
మార్చి 31 నుంచి ఐపీఎల్ 16వ సీజన్ మొదలుకానుంది. ఇప్పటికే బీసీసీఐ షెడ్యూల్ విడుదల చేసింది. తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ను ఢీ కొట్టనుంది. దాంతో, మళ్లీ ధోనీ హెలిక్యాప్టర్ షాట్లను చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. 2023 ఐపీఎల్ మినీ వేలంలో ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కరన్ భారీ ధర పలికాడు. అతడిని రూ.18.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.