Mitchell Starc : వరల్డ్ నంబర్ 1 జట్టు ఆస్ట్రేలియా(Australia) టెస్టు చాంపియన్షిప్ విజేతగా అవతరించింది. ఓవల్(Oval) మైదానంలో సంచలన ఆటతో భారత్ను చిత్తుగా ఓడించి టెస్టు గదను సొంతం చేసుకుంది. స్పీడ్స్టర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc) నాలుగు వికెట్లతో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. టెస్టు చాంపియన్షిప్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న అతను ఫ్రాంచైజీ క్రికెట్పై సంచలన కామెంట్లు చేశాడు. తాను ఎల్లప్పుడూ ఫ్రాంచైజీల కంటే దేశానికి ఆడడానికే తొలి ప్రాధాన్యం ఇస్తానని అన్నాడు.
‘ఐపీఎల్(IPL)ను నేను ఆస్వాదించాను. అయితే.. నాకు ఆస్ట్రేలియాకు ఆడడమే టాప్ ప్రియారిటీ. అందకోసం ఫ్రాంచైజీని వదులుకునేందుకు నేను సిద్ధం. అలాగని ఆ తర్వాత ఎందుకిలా చేశాను? అని నేను బాధపడను. ఎందుకంటే..? డబ్బులు వస్తాయి.. పోతాయి’ అని స్టార్క్ తెలిపాడు. అంతేకాదు ఫ్రాంచైజీ క్రికెట్తో కుప్పలుగా వచ్చి పడే సొమ్ము అంత మంచిది కాదని, అది తప్పు చేయడానికి కారకం అవుతుందని ఈ స్టీడ్స్టర్ తెలిపాడు.
ఐసీసీ ట్రోఫీలతో హేజిల్వుడ్, డేవిడ్ వార్నర్, ప్యాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్
డబ్ల్యూటీసీ విజయంతో మిచెల్ స్టార్క్ మరో ఘనత సాధించాడు. మూడు ఫార్మాట్లలో ఐసీసీ ట్రోఫీ(ICC Trophy)లు నెగ్గిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడిగా అతను రికార్డుల్లోకి ఎక్కాడు. అతడితో పాటు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్వుడ్ కూడా ఈ ఫీట్ సాధించారు.
మిచెల్ స్టార్క్ ఐపీఎల్ కెరీర్ 2014లో మొదలైంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) ఈ ఎడమ చేతివాటం బౌలర్నుర రూ.5 కోట్లకు కొన్నది. ఆ సీజన్లో స్టార్క్ 8 మ్యాచుల్లోనే 14 వికెట్లతో సత్తా చాటాడు. మోకాలి గాయం వల్ల అతను ఆ తర్వాతి సీజన్ ఆడలేదు. 2017లో జాతీయ జట్టుకు ఆడడం కోసం ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. మళ్లీ 2018లో కోల్కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) తరఫున బరిలోకి దిగాడు. 2020, 2-23లో అతను వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి వైదొలిగాడు. ఈ పొడగరి ఫాస్ట్ బౌలర్ ఐపీఎల్లో మొత్తంగా 26 మ్యాచ్లు ఆడాడంతే. డెత్ ఓవర్ స్పెషలిస్ట్గా పేరొందిన అతను 7.81 ఎకానమీతో 41 వికెట్లు నేలకుల్చాడు. యార్కర్లు, స్లో బాల్స్ వేయడంలో స్టార్క్ దిట్ట.
ఆర్సీబీ జెర్సీతో స్టార్క్(2014)
టెస్టు చాంపియన్షిప్ తొలి ఇన్నింగ్స్లో స్టార్క్ ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీని ఔట్ చేశాడు. రెండో ఇన్నింగ్స్లో అజింక్యా రహానేను పెవిలియన్ పంపి భారత్ను దెబ్బకొట్టాడు. నాథన్ లియాన్ ఓవర్లో సిరాజ్ స్వీప్ షాట్ ఆడి బోలాండ్ చేతికి చిక్కాడు. దాంతో 234 పరుగుల వద్ద టీమిండియా ఆలౌట్ అయింది. ఏకపక్షంగా సాగిన ఫైనల్ పోరులో ఆసీస్ 209 పరుగలు తేడాతో గెలిచింది. భారీ విజయంతో ఆ జట్టు తొలిసారే టెస్టు గదను తన్నుకుపోయింది. ఇంకేముంది.. రెండోసారైనా చాంపియన్గా నిలవాలనుకున్న టీమిండియా కల చెదిరింది.