హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక చెస్ ప్రపంచకప్లో రన్నరప్గా నిలిచిన భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్ ప్రజ్ఞానందను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత మెగాటోర్నీలో ఫైనల్ చేరిన రెండో భారత జీఎంగా నిలిచిన ప్రజ్ఞాకు ట్విట్టర్ వేదికగా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎంతో అద్భుతమైన ప్రయాణం చాంప్. యావత్తు దేశం గర్వపడేలా చేసిన నీకు కృతజ్ఞతలు. నీతో పాటు మీ అమ్మను చూస్తే చాలా గర్వంగా ఉంది’ అని ట్వీట్ చేశారు.
పజ్ఞా తల్లిదండ్రులకు ఈవీ కారు: ఆనంద్ మహీంద్రా
చెస్ ప్రపంచకప్లో అద్భుత ప్రతిభ కనబరిచిన యువ జీఎం ప్రజ్ఞానందను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో అభినందించారు. ఒక అభిమాని ట్వీట్కు స్పందిస్తూ ‘వాస్తవానికి ప్రజ్ఞాకు ఎస్యూవీ థార్ ఇవ్వాలనుకున్నా. కానీ పిల్లలను వీడియో గేమ్స్ వైపు కాకుండా చెస్కు ఆకర్షితులయ్యేలా చేస్తున్న తల్లిదండ్రులను ప్రోత్సహించదల్చుకున్నాను. ప్రజ్ఞానంద ఆసక్తిని గమనిస్తూ నిరంతరం అండగా నిలుస్తూ అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లిన నాగలక్ష్మి, రమేశ్బాబుకు మహీంద్రా ఎక్స్యూవీ 400 ఈవీ కారును బహుమతిగా ఇస్తున్నాను’ అని ట్వీట్లో రాసుకొచ్చారు.