చండీగఢ్: పరుగునే ప్రాణంగా భావించిన దిగ్గజ స్ప్రింటర్ మిల్కాసింగ్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. క్రీడాభిమానులను శోకసంద్రంలోకి నెడుతూ ఇక సెలవు అంటూ తుదిశ్వాస విడిచారు. కరోనా వైరస్తో కడదాకా పోరాడిన మిల్కా శుక్రవారం అర్ధరాత్రి తనువు చాలించారు.
దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్ అంత్యక్రియలు శనివారం అధికారిక లాంఛనాల మధ్య జరిగాయి. అభిమానుల అశ్రునయనాల మధ్య పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి నివాళి అర్పించగా, జీవ్ మిల్కాసింగ్ తన తండ్రి చితికి నిప్పంటించారు. పంజాబ్ ప్రభుత్వం నిర్వహించిన అధికారిక అంత్యక్రియల కార్యక్రమానికి కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు, పంజాబ్ గవర్నర్ వీపీ సింగ్ బద్నోర్, ఆర్థిక శాఖ మంత్రి మన్ప్రీత్సింగ్ బాదల్ తదితరులు హాజరయ్యారు.
‘ఫ్లయింగ్ సిఖ్’ మిల్కాసింగ్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రాష్ట్రపతి, ప్రధాని మొదలు, పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు, క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు మిల్కాసింగ్కు నివాళి అర్పించారు. మిల్కాసింగ్ జీవిత పయనం ఎందరో భారతీయులకు స్ఫూర్తి దాయకమని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతాపం ప్రకటించారు. దేశం అత్యుత్తమ అథ్లెట్ కోల్పోయిందని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ‘దేశం అరుదైన సంపదల్లో ఒకటిగా భావించే దిగ్గజ అథ్లెట్ మిల్కాను కోల్పోయింది. ఆయన లేని లోటు పూడ్చలేనిది. మిల్కా అంకితభావం, ఆత్మవిశ్వాసం వెలకట్టలేనివి’ అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.