Matthew Kuhnemann : నాగ్పూర్ టెస్టులో చిత్తుగా ఓడిపోయిన ఆస్ట్రేలియా రెండో టెస్టులో విజయంపై కన్నేసింది. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ నాలుగు టెస్టుల సిరీస్లో 1-0తో ఉన్న పర్యాటక జట్టు స్పిన్ అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. అందుకోసం మూడో స్పిన్నర్గా ఎడమ చేతివాటం స్పిన్నర్ మాథ్యూ కుహ్నేమాన్ను తీసుకోనుంది. మిచెల్ స్వెప్సన్ స్థానంలో అతడికి జట్టులో చోటు కల్పించింది.
మాథ్యూ రెండో టెస్టుకు ముందే జట్టుతో కలవనున్నాడు. త్వరలోనే మిచెల్ మొదటి బిడ్డకు తండ్రి కాబోతున్నాడు. దాంతో అతను తిరిగి స్వదేశానికి వెళ్లనున్నాడు. మాథ్యూ 2017లో ఆస్ట్రేలియా ఏ జట్టు తరఫున ఆడాడు. కొన్నాళ్లు క్వీన్స్లాండ్తో కొనసాగాడు. 2022 జూన్లో ఈ స్పిన్నర్ జాతీయ జట్టు తరఫున తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.
ఆసీస్ జట్టును గాయాలు వేధిస్తున్నాయి. గాయంతో స్టార్ పేసర్ హేజిల్వుడ్ తొలి రెండు టెస్టులకు దూరం అయ్యాడు. వేలికి గాయం కావడంతో ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ మొదటి టెస్టు ఆడలేదు. అతను రెండో టెస్టు లోపు కోలుకుంటాడని ఆసీస్ జట్టు భావిస్తోంది. ఒకవేళ గ్రీన్ ఫిట్గా ఉంటే మరో పేసర్ను తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫిబ్రవరి 17న ఢిల్లీలో రెండో టెస్టు ప్రారంభం కానుంది.
నాగ్పూర్లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 132 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత్ మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగించింది. రోహిత్ సెంచరీతో ఆదుకోగా జడేజా, అక్షర్ పటేల్లు అర్థ శతకాలతో రాణించారు. ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 8 వికెట్లు, జడేజా 7 వికెట్లు, తీసి పర్యాటక జట్టును బెంబేలెత్తించారు. వీళ్లిద్దరూ చెలరేగంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 177, రెండో ఇన్నింగ్స్లో 91 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో మూడో స్పిన్నర్ ఉంటే ఆస్ట్రేలియా పరిస్థితి వేరేలా ఉండేది. మూడో స్పిన్ ఆప్షన్ లేకపోవడంతో కెప్టెన్ కమిన్స్ లియాన్, మర్ఫీల తోనే ఎక్కువ ఓవర్లు వేయించాడు.