IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్(IPL 2024)కు కొన్ని రోజులే ఉంది. మినీ వేలానికి రెండు వారాలే ఉండడంతో అన్ని ఫ్రాంచైజీలు కొత్త ఆటగాళ్ల కొనుగోలుపై భారీ కసరత్తులు మొదలెట్టాయి. ఇక ఐపీఎల్ పాలకమండలి, బీసీసీఐ కూడా ఆక్షన్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే.. 15 ఏండ్లుగా కొనసాగుతున్న సాంప్రదాయానికి బీసీసీఐ తెరదించింది. అవును.. 17వ సీజన్ మినీ వేలం నిర్వహించే వ్యక్తి మారుతున్నారు. రిచర్డ్ మెడ్లే తర్వాత 2018 నుంచి వేలం పాటకు వ్యాఖ్యతగా ఉంటున్న హుగ్ ఎడ్మిడ్స్(Hugh Edmeades) స్థానంలో ఈసారి మలికా సాగర్(Malika Sagar) కనిపించనుంది.
ఇప్పటికే మహిళల ప్రీమియర్ లీగ్(WPL), ప్రో కబడ్డీ లీగ్(PKL) వేలం నిర్వహించిన అనుభవం ఉన్న మలికా వేలం ప్రక్రియను నిర్వహించనుంది. బ్రిటన్కు చెందిన ఎడ్మిడ్స్ 2018లో రిచర్డ్ మెడ్లే(Richard Medeley) నుంచి ఐపీఎల్ వేలం వ్యాఖ్యతగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి 2023 మినీ వేలం వరకూ ఆయనే ఆక్షనీర్గా ఉన్నారు.
హ్యారీ బ్రూక్, శార్దూల్ ఠాకూర్, సామ్ కరన్
డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా ఐపీఎల్ 17వ సీజన్ మినీ వేలం మొదలవ్వనుంది. ఈసారి 1,166 మంది పేర్లు రిజిష్టర్ చేసుకున్నారు. వీళ్లలో 830 మంది భారత క్రికెటర్లు ఉన్నారు. ఈ మొత్తం జాబితాలో 212 మంది క్యాప్డ్ ఆటగాళ్లు కాగా.. 909 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు. అన్ని ఫ్రాంచైజీలు మొత్తంగా ఈసారి 262.95 కోట్లు ఖర్చు చేయనున్నాయి. నిరుడు కొచ్చిలో జరిగిన మినీ వేలంలో ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కరన్ రికార్డు ధర పలికిన విషయం తెలిసిందే. పంజాబ్ కింగ్స్ అతడిని రూ.18.50 కోట్లకు కొన్నది. ఈసారి వేలంలో రూ. 2 కోట్ల కనీస ధరకు రిజిష్టర్ అయిన ఆటగాళ్లు వీళ్లే..
భారత్ – హర్షల్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, కేదార్ జాదవ్.
ఇంగ్లండ్ – హ్యారీ బ్రూక్, టామ్ బాంటన్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్.
ఆస్ట్రేలియా – ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్వుడ్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, సియాన్ అబాట్.
దక్షిణాఫ్రికా – రీలే రస్సో, రసీ వాండర్ డస్సెన్, గెరాల్డ్ కోయెట్జీ.
అఫ్గనిస్థాన్ – ముజీబ్ ఉర్ రెహ్మాన్.
బంగ్లాదేశ్ – ముస్తాఫిజుర్ రెహ్మాన్.
శ్రీలంక – ఏంజెలో మాథ్యూస్.