Mahela Jayawardena : బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. అయితే.. ఈ సిరీస్లో విజేతగా నిలిచేది ఆస్ట్రేలియానే అని శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్దనే అన్నాడు. ఆస్ట్రేలియా 2-1తో సిరీస్ హస్తగతం చేసుకుంటుందని ఆయన అభిప్రాయ పడ్డాడు. ఐసీసీ రివ్యూతో మాట్లాడిన అతను ఈ విషయం వెల్లడించాడు. ‘బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో ఎవరు గెలుస్తారనేది ఊహించడం కష్టమే. అయితే.. శ్రీలంక మాజీ ఆటగాడిగా ఆస్ట్రేలియా 2-1తో సిరీస్ గెలుస్తుందని భావిస్తున్నా’అని జయవర్దనే తెలిపాడు. ఇది నిజంగా గొప్ప సిరీస్ అవుతుందని అతను అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘భారత పిచ్లపై ఆసీస్ బ్యాటర్లు ఎలా రాణిస్తారనేది వేచి చూడాలి. అయితే ఆ జట్టు బౌలింగ్ లైనప్ బలంగా ఉంది. పటిష్టమైన ఆసీస్ బౌలింగ్ అటాక్ను భారత ఆటగాళ్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరం. మొదటి టెస్టు ఏ జట్టు గెలుస్తుందో ఆ జట్టుకు సిరీస్ గెలిచే అవకాశాలు ఎక్కువ’ అని జయవర్దనే వెల్లడించాడు.
శుభ్మన్ టెక్నిక్ అద్భుతం
భారత యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ టెక్నిక్ అద్భుతమని, అతను పేస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటాడని జయవర్దనే అన్నాడు. ‘ప్రస్తుతం గిల్ అత్యుత్తమంగా ఆడుతున్నాడు. వన్డే, టీ20 ఫామ్ను అతను టెస్టుల్లో కొనసాగిస్తే భారత్కు కలిసొస్తుంది. టాపార్డర్లో గిల్ ఇండియాకు కీలకం కానన్నాడు. అతను శుభారంభం ఇస్తూ, ప్రత్యర్థి బౌలర్లను ఒత్తడిలోకి నెడుతాడు’ అని జయవర్దనే చెప్పుకొచ్చాడు. ఇరుజట్లు ఫిబ్రవరి 9న నాగ్పూర్లో తొలి టెస్టు ఆడనున్నాయి.
మూడో స్థానంలో శ్రీలంక
దాదాపు 11 ఏళ్లుగా భారత జట్టు స్వదేశంలో టెస్టు సిరీస్ కోల్పోలేదు. సొంత గడ్డపై ఘనమైన రికార్డు ఉన్నభారత్ను ఆసీస్ నిలువరిస్తుందా? అనేది నాగ్పూర్ టెస్టులో తెలియనుంది. వరల్డ్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా, భారత్ వరుసగా మొదటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. శ్రీలంక మూడో స్థానంలో ఉంది. ఈ సిరీస్లో ఇండియా ఓడిపోతే శ్రీలంక డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది. ఏడాది వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ ఫైనల్) ముందు జరగుతున్న కీలకమైన సిరీస్ ఇది. భారత్కు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు కోసం ఈ సిరీస్ చాలా ముఖ్యం.