అసలు చూస్తున్నది మ్యాచా లేక హైలైట్సా అన్నట్లు బ్యాటర్లు ఒకరిని మించి ఒకరు విధ్వంసం సృష్టించిన వేళ.. లక్నో భారీ విజయాన్ని మూటగట్టుకుంది. మయేర్స్, బదో ని, స్టొయినిస్, పూరన్ వంతులు వేసుకొని వీర బాదుడు బాదడంతో లక్నో కొండంత స్కోరు చేయగా.. ఛేదనలో పంజాబ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
మొహాలీ: ఫ్లాట్ పిచ్పై బ్యాటర్లు పరుగుల పండుగ చేసుకున్న పోరులో లక్నోను విజయం వరించింది. ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ 56 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. మార్కస్ స్టొయినిస్ (40 బంతుల్లో 72; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), కైల్ మయేర్స్ (24 బంతుల్లో 54; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), నికోలస్ పూరన్ (19 బంతుల్లో 45; 7 ఫోర్లు, ఒక సిక్సర్), ఆయుష్ బదోని (43; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టారు.
పంజాబ్ బౌలర్లలో రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో పంజాబ్ 19.5 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటైంది. అథర్వ (36 బంతుల్లో 66; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. గాయం నుంచి కోలుకొని వచ్చిన కెప్టెన్ ధవన్ (1) ఆకట్టుకోలేకపోయాడు. లక్నో బౌలర్లలో యష్ ఠాకూ ర్ 4, నవీన్ మూడు వికెట్లు పడగొట్టారు. లీగ్లో భాగంగా శనివారం కోల్కతాతో గుజరాత్, ఢిల్లీతో హైదరాబాద్ తలపడనున్నాయి.