ఐపీఎల్లో తొలి మ్యాచ్ పరాజయం అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ తమ రెండో మ్యాచ్లో బోణీ కొట్టింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటిన ఆ జట్టు.. సన్రైజర్స్ హైదరాబాద్ను వారి సొంతగడ్డపైనే చిత్తుచేసి టైటిల్ వేటను మొదలెట్టింది. మొదట మహ్మద్ షమీ నిప్పులు చెరిగే బౌలింగ్తో విజృంభించడంతో ప్రత్యర్థిని లక్నో తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. మిడిలార్డర్లో క్లాసెన్, నితీశ్ మరోసారి జట్టును ఆదుకునే యత్నం చేసినా వారి పోరాటం సరిపోలేదు. ఛేదనలో లక్నో సైతం ఒడిదొడుకులకు లోనైనా రిషభ్ పంత్ ‘కెప్టెన్ ఇన్నింగ్స్’తో ఆ జట్టుకు విజయాన్ని అందించాడు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఈ సీజన్లో సొంతగడ్డపై ఆడిన తొలి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. గత మ్యాచ్లో ఈడెన్ గార్డెన్ వేదికగా ఆల్రౌండ్ ఆటతో గెలుపు బోణీ కొట్టిన సన్రైజర్స్.. సొంత మైదానంలో సూపర్జెయింట్స్ చేతిలో తడబాటుకు గురై అభిమానులను నిరాశకు గురిచేసింది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా ఆదివారం ‘లాస్ట్ ఓవర్ థ్రిల్లర్’గా సాగిన పోరులో లక్నోదే పైచేయి అయింది. మొదట మహ్మద్ షమీ (2/9) అదిరిపోయే ఓపెనింగ్ స్పెల్తో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 156/9కే పరిమితమైంది. హెన్రిచ్ క్లాసెన్ (41 బంతుల్లో 62, 5 ఫోర్లు, 2 సిక్స్లు), నితీశ్ కుమార్ రెడ్డి (33 బంతుల్లో 56, 3 ఫోర్లు, 5 సిక్స్లు) ఆదుకోకుంటే ఆ జట్టు పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఛేదనలో కెప్టెన్ రిషభ్ పంత్ (50 బంతుల్లో 68 నాటౌట్, 9 ఫోర్లు) సాధికారిక ఇన్నింగ్స్కు ఎయిడెన్ మార్క్మ్ (27 బంతుల్లో 45, 6 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపులు తోడవడంతో ఛేదనను ఆ జట్టు 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి పూర్తిచేసింది. షమీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
29/4.. హెడ్ (7), అభిషేక్ (0), ఇషాన్ (1), లివింగ్స్టొన్ (14) వంటి బ్యాటింగ్ లైనప్ ఉన్న హైదరాబాద్ 8 ఓవర్లలో చేసిన స్కోరిది! నిరుటి సీజన్ దాకా సన్రైజర్స్తో ఉండి ఈ సీజన్లో లక్నోకు ట్రేడ్ అయిన షమీ పేస్ పదునుకు ఆతిథ్య జట్టు విలవిల్లాడింది. తన తొలి ఓవర్లోనే అభిషేక్ను ఔట్ చేసిన అతడు.. రెండో ఓవర్ ఫస్ట్ బాల్కు హెడ్నూ పెవిలియన్కు పంపి ఆదిలోనే ఎస్ఆర్హెచ్ను దెబ్బతీశాడు. మరుసటి ఓవర్లో ప్రిన్స్.. ఇషాన్ను బౌల్డ్ చేయగా ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన లివింగ్స్టొన్ను దిగ్వేశ్ బోల్తా కొట్టించాడు. షమీ వరుసగా 4 ఓవర్లు విసిరి 9 పరుగులు మాత్రమే ఇవ్వడంతో సన్రైజర్స్ 10 ఓవర్లకు చేసిన స్కోరు 35/4 మాత్రమే. ఆ స్థితి నుంచి హైదరాబాద్ ఈమాత్రం స్కోరైనా చేసిందంటే అది నితీశ్, క్లాసెన్ చలవే. ఈ ఇద్దరూ ఐదో వికెట్కు 63 బంతుల్లో 116 రన్స్ జోడించి ఇన్నింగ్స్ను గాడిలో పెట్టారు. ప్రిన్స్ 11వ ఓవర్లో చెరో సిక్స్ కొట్టిన ఈ ద్వయం బ్యాట్కు పనిచెప్పడంతో స్కోరువేగం పుంజుకుంది. అవేశ్ ఓవర్లో క్లాసెన్ నాలుగు ఫోర్లు బాదగా దిగ్వేశ్ ఓవర్లో నితీశ్ 3 సిక్స్లు కొట్టాడు. అయితే అర్ధ శతకాల తర్వాత ఈ ఇద్దరూ వరుస ఓవర్లలో నిష్క్రమించడంతో సన్రైజర్స్ మళ్లీ తడబడింది. లోయరార్డర్ కూడా బ్యాట్ ఝుళిపించలేకపోయింది.

ఛేదన స్వల్పమే అయినా లక్నో ఇన్నింగ్స్ సైతం ఒడిదొడుకులకు లోనైంది. మలింగ.. నాలుగో ఓవర్లో మార్ష్ (14) ను ఔట్ చేసినా పంత్ అండతో మార్క్మ్ ధనాధన్ మెరుపులు మెరిపించాడు. నితీశ్ రెండో ఓవర్లో మూడు బౌండరీలు కొట్టిన అతడు.. ఉనద్కత్ ఓవర్లోనూ రెండు ఫోర్లు, సిక్స్తో రెచ్చిపోయాడు. అర్ధ శతకానికి చేరువవుతున్న అతడిని శివాంగ్ బోల్తా కొట్టించడంతో లక్నో రెండో వికెట్ కోల్పోయింది. బదోని (12)ని ఇషాన్ స్టంపౌట్ చేయగా ప్రమాదకర పూరన్ కూడా అతడే రనౌట్ చేయడంతో మ్యాచ్లో హైదరాబాద్ పోటీలోకి వచ్చింది. కానీ అప్పటికే క్రీజులో కుదురుకున్న పంత్.. సమద్ (16) అండగా ఇన్నింగ్స్ను నడిపించాడు. ఉనద్కత్ ఓవర్లో రెండు బౌండరీలతో ఫిఫ్టీకి చేరువైన లక్నో సారథి.. హర్ష్ ఓవర్లో ఫోర్తో ఈ సీజన్తో తన తొలి హాఫ్ సెంచరీని సాధించాడు. అదే ఓవర్లో సమద్ నిష్క్రమించగా మరుసటి ఓవర్లో హర్షల్ నాలుగు పరుగులే ఇవ్వడంతో లక్నో గెలుపు సమీకరణం 6 బంతుల్లో 9గా మారింది. ఈ దశలో ఇరుజట్ల డగౌట్లలో ఉత్కంఠ రేగినా ఉనద్కత్ ఆఖరి ఓవర్లో పంత్ మూడు బౌండరీలతో లాంఛనాన్ని పూర్తిచేశాడు.
హైదరాబాద్: 20 ఓవర్లకు 156/9 (క్లాసెన్ 62, నితీశ్ 56, షమీ 2/9, ప్రిన్స్ యాదవ్ 2/34)
లక్నో: 19.5 ఓవర్లకు 160/5 (పంత్ 68*, మార్క్మ్ 45, దూబె 2/18, మలింగ 1/30)
