శాన్జువాన్(పోర్టారికో): జమైకా దిగ్గజ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ ఒక ప్రైవేట్ సంస్థలో మదుపు చేసిన 12.7 మిలియన్ డాలర్లు అదృశ్యమయ్యాయి. అతని లాయర్ దీనిపై ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బోల్ట్కు సంబంధించిన ఖాతాలో కేవలం 12,000 వేల డాలర్లు మాత్రమే ఉన్నట్టు అతని లాయర్ పేర్కొన్నాడు. పోయిన సొమ్ము పది రోజుల్లో తిరిగి ఖాతాలో వేయకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్టు బోల్ట్ తరఫు న్యాయవాది లింటన్ పి గార్డన్ హెచ్చరించాడు. అయితే జరిగిన మోసంపై స్టాక్స్-సెక్యూరిటీస్ సంస్థ వెంటనే స్పందించలేదు. మరోవైపు దీనిపై విచారణ జరుపుతున్నట్టు, త్వరలోనే పోయిన సొమ్మును అందజేస్తామని జమైకా ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిషన్ తెలిపింది. సంస్థ కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు ఒక ప్రైవేటు సంస్థకు బాధ్యతలు అప్పగించినట్టు వెల్లడించింది.