ఢిల్లీ : భారత స్టార్ లాంగ్జంప్ ప్లేయర్ మురళీ శ్రీశంకర్ ఒలింపిక్స్ కల చెదిరింది. జులై – ఆగస్టులో పారిస్ వేదికగా జరుగబోయే విశ్వక్రీడలకు సన్నద్ధమవుతున్న మురళీకి రెండ్రోజుల క్రితం ప్రాక్టీస్ చేస్తూ మోకాలికి గాయం అవగా, గాయాన్ని పరిశీలించిన వైద్యులు అతడికి శస్త్రచికిత్స అవసరమని తేల్చి చెప్పారు. దీంతో ఒలింపిక్స్తో పాటు ఈ సీజన్ మొత్తానికి దూరమైనట్టు అతడు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపాడు. ‘దురదృష్టవశాత్తూ ఇది ఒక పీడకలలా అనిపిస్తోంది. కానీ ఇదే వాస్తవం. నా పారిస్ ఒలింపిక్స్ కల చెదరింది. మంగళవారం ట్రైనింగ్ సెషన్లో నా మోకాలికి గాయమైంది’ అని రాసుకొచ్చాడు. 2023 ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో శ్రీశంకర్.. 8.37 మీటర్లు దూకి రజత పతకంతో పాటు ఒలింపిక్స్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.