చెన్నై: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న న్యూజిలాండ్.. వన్డే ప్రపంచకప్లో హ్యాట్రిక్ కొట్టింది. తొలి రెండు మ్యాచ్ల్లో ఇంగ్లండ్, నెదర్లాండ్స్ను చిత్తుచేసిన కివీస్ శుక్రవారం మూడో మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను మట్టికరిపించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన బంగ్లా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది.
ముష్ఫికర్ రహీమ్ (66) అర్ధశతకం బాదగా.. కెప్టెన్ షకీబ్ (40), మహ్ముదుల్లా (41 నాటౌట్) ఆకట్టుకున్నారు. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్ 3, బౌల్ట్, హెన్రీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 42.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. డారిల్ మిషెల్ (67 బంతుల్లో 89 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (78; 8 ఫోర్లు, ఒక సిక్సర్) దుమ్మురేపారు. ఫెర్గూసన్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.