Kyle Jamieson : ఇంగ్లండ్ పర్యటనకు సిద్ధమవుతున్న న్యూజిలాండ్కు ఎదురుదెబ్బ తగలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ కైల్ జేమీసన్ ఇంగ్లండ్ సిరీస్కు దూరం కానున్నాడు. వెన్నుముక గాయం తిరగబెట్టడంతో అతను సిరీస్ నుంచి వైదొలిగాడు. అంతేకాదు ఫాస్ట్ బౌలర్ మ్యాట్ హెన్రీ కూడా మొదటి టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. త్వరలోనే అతడి భార్య మొదటి బిడ్డకు జన్మనివ్వనుంది. దాంతో, అతను తొలి టెస్టు ఆడడం లేదు. వీళ్లిద్దరి ప్లేస్లో జాకబ్ డఫీ, స్కాట్ కుగ్గెలీజన్లను తుది జట్టులోకి తీసుకుంది. మొదటి టెస్టు బే ఓవల్ స్టేడియంలో జరగనుంది. న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో రెండు టెస్టులు ఆడనుంది.
గత ఏడాది జూన్లో ఇంగ్లండ్ పర్యటన సమయంలో జేమీసన్ వెన్ను నొప్పితో బాధపడ్డాడు. గాయం నుంచి కోలుకున్నట్టే కనిపించాడు. కానీ, మళ్లీ గాయం తిరగబెట్టింది. జేమీసన్ సిరీస్కు దూరం కావడంపై కివీస్ కోచ్ గ్యారీ స్టీడ్ స్పందించాడు. ‘ఇది నిజంగా జేమిసన్ను చాలా బాధించి ఉంటుంది. గాయం నుంచి కోలుకున్న అతను చాలా కష్టపడి మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. జూన్లో గాయం అయినప్పటి నుంచి జేమీసన్ను మా వైద్య బృందం నిరంతరం పరీక్షిస్తోంది. స్కాన్లు కూడా తీశాం. అయితే.. అతడు క్రిస్ట్చర్చ్లో శుక్రవారం సిటీ స్కాన్ తీయించుకుంటాడు. ఆ తర్వాతే అతడి గురించి వెల్లడిస్తాం’ అని స్టీడ్ తెలిపాడు.
రెండేళ్ల క్రితం న్యూజిలాండ్ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ట్రోఫీని గెలవడంలో జేమీసన్ కీలక పాత్ర పోషించాడు. ఐసీసీ తొలిసారి నిర్వహించిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కివీస్, భారత్ను ఓడించి టెస్టు ఛాంపియన్ గదను సొంతం చేసుకుంది. ఈ ఏడాది జూన్లో ఓవల్ స్టేడియం వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియాకు ఫైనల్ బెర్తు దాదాపు ఖాయం అయింది. రెండో ప్లేస్ కోసం భారత్ పోటీ పడుతోంది. స్వదేశంలో జరగుతున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ నెగ్గితే టీమిండియా ఫైనల్ చేరుతుంది.