ఈనెల 27 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభంకావాల్సి ఉన్న ఆసియా కప్ కోసం సోమవారం రాత్రి 15 మందితో కూడిన భారత జట్టును సెలక్టర్లు ప్రకటించారు. టీ20 ప్రపంచకప్కు ముందు జరుగుతున్న మెగా టోర్నీ కావున దాదాపు ఆల్ ఫార్మాట్, సీనియర్ ప్లేయర్లనే ఇందుకు ఎంపికచేశారు. అయితే గాయపడిన పేసర్ జస్ప్రిత్ బుమ్రా స్థానంలో షమీని ఎంపికచేసి ఉంటే బాగుండేదని భారత మాజీ ఆటగాడు, సెలక్టర్ గానూ పనిచేసిన కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నాడు.
ఆసియా కప్ కోసం భారత జట్టును ప్రకటించిన తర్వాత శ్రీకాంత్ ఓ క్రీడా ఛానెల్తో మాట్లాడుతూ.. ‘నేను సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఉంటే ఈ జట్టులో షమీ కచ్చితంగా ఉండేవాడు. గాయపడ్డ బుమ్రా స్థానంలో అతడిని ఎంపిక చేసి ఉండాల్సింది. నా జట్టులో నేనైతే రవి బిష్ణోయ్కు చోటివ్వను. అశ్విన్-అక్షర్ పటేల్ల మధ్య తీవ్రపోటీ నెలకొంది..
మొత్తంగా చూస్తే జట్టు బాగానే ఉంది. అక్టోబర్లో ఆస్ట్రేలియా వేదికగా జరుగబోయే టీ20 ప్రపంచకప్కు ఈ జట్టు బ్లూప్రింట్లా ఉంది. అయితే నలుగురు స్పిన్నర్ల కంటే మరో మీడియం పేసర్ అవసరం భారత్కు ఎంతైనా ఉంది. అక్షర్ పటేల్ జట్టులో లేకపోయినా దీపక్ హుడాను ఎంపిక చేయడం మంచి ఛాయిస్. హుడా మంచి హిట్టర్ మాత్రమే కాదు.. ఉపయుక్తకరమైన ఆఫ్ స్పిన్నర్. అతడు రాబోయే ఆసియా కప్తో పాటు టీ20 ప్రపంచకప్లో కూడా రాణిస్తాడని నేను నమ్ముతున్నా..’ అని తెలిపాడు.
ఆసియా కప్-2022కు భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తిక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, అవేశ్ ఖాన్