ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) వరుస ఓటములకు ముగింపు పలికింది. గెలిస్తే గానీ నిలిచే పరిస్థితుల్లోలేని స్థితిలో సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కు వారి సొంతగడ్డపైనే చెక్ పెడుతూ కోల్కతా కమాల్ చేసింది. రాయ్, రానా విజృంభణతో పోరాడే స్కోరు అందుకున్న కోల్కతా.. పక్కా ప్రణాళికతో ఆర్సీబీ బ్యాటర్లను అడ్డుకుంది. కెప్టెన్ కోహ్లీ అర్ధసెంచరీతో ఆకట్టుకున్నా.. సహచరుల వైఫల్యం జట్టును గెలిపించలేకపోయింది. మొత్తంగా చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు అభిమానులను ఆకట్టుకుంది.
బెంగళూరు: ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ మళ్లీ గాడిలో పడింది. వరుస ఓటములతో కంగుతిన్న కోల్కతా జూలు విదిల్చింది. బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 21 పరుగుల తేడాతో బెంగళూరుపై అద్భుత విజయం సాధించింది. రాయ్(29 బంతుల్లో 56, 4ఫోర్లు, 5 సిక్స్లు), నితీశ్ రానా (21 బంతుల్లో 48, 3 ఫోర్లు, 4 సిక్స్లు) విజృంభణతో తొలుత కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 200/5 స్కోరు చేసింది. హసరంగ(2/24), విశాక్(2/41)రెండేసి వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనలో వరుణ్ చక్రవర్తి (3/27), రస్సెల్ (2/29), సుయాశ్ శర్మ(2/30) రాణింపుతో ఆర్సీబీ 179/8 స్కోరుకు పరిమితమైంది. కోహ్లీ(37 బంతుల్లో 54, 6 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. చక్రవర్తికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
ఆర్సీబీకి కేకేఆర్ దిమ్మతిరిగే రీతిలో చెక్పెట్టింది. సిక్స్లకు కేరాఫ్ అడ్రస్ అయిన చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరుపై కేకేఆర్దే పైచేయి అయ్యింది. నిర్దేశిత లక్ష్యఛేదనలో కెప్టెన్ కోహ్లీ ఒంటరి పోరాటం చేయగా, సహచరుల నుంచి సహకారం కరువైంది. దీనికి తోడు బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించడం కోల్కతాకు కలిసొచ్చింది. లామ్రోర్(34), కార్తీక్(22) గెలిపించేందుకు ప్రయత్నించినా కోల్కతా కట్టుదిట్టమైన బౌలింగ్కు తోడు సూపర్ ఫీల్డింగ్తో మ్యాచ్ ను తమ వశం చేసుకుంది. స్పిన్నర్లు చక్రవర్తి, సుయాశ్ ఆర్సీబీ బ్యాటర్ల పనిపట్టగా, బ్యాటింగ్లో విఫలమైన రస్సెల్ బౌలింగ్లో రాణించి కేకేఆర్ గెలుపులో కీలకమయ్యాడు.
మొదట బ్యాటింగ్కు దిగిన కోల్కతా ఆది నుంచే దూకుడు కనబరిచింది. ఓపెనర్లు జాసన్ రాయ్, నారాయణ జగదీశన్ బౌండరీలే లక్ష్యంగా చెలరేగారు. మంచి ఫామ్మీదున్న రాయ్..బెంగళూరు బౌలర్లను దునుమాడుతూ స్కోరుబోర్డును పరిగెత్తించాడు. సిరాజ్ వేసిన తొలి ఓవర్లో రాయ్ ఫోర్లతో తన ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పాడు. ఓవైపు ఈ ఇంగ్లిష్ బ్యాటర్ తన జోరు ప్రదర్శిస్తే..మరోవైపు తానేం తక్కువ కాదన్నట్లు జగదీశన్ కూడా బౌండరీలు బాదడంతో కేకేఆర్కు పరుగులు వెల్లువెత్తాయి. షాబాజ్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో రాయ్ నాలుగు భారీ సిక్స్లతో విరుచుకుపడ్డాడు. దీంతో స్టేడియం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. కీలకమైన పవర్ప్లే ముగిసే సరికి కోల్కతా వికెట్ కోల్పోకుండా 66 పరుగులు చేసింది. ఈ సీజన్లో కోల్కతాకు పవర్ప్లేలో ఇదే అత్యుత్తమ స్కోరు. బౌలింగ్ మార్పుగా వచ్చిన హసరంగ..కేకేఆర్ బ్యాటర్ల దూకుడుకు బ్రేక్ వేస్తూ తన రెండో ఓవర్లో 2 పరుగులు మాత్రమే ఇచ్చుకున్నాడు. ఈ క్రమం లో 22 బంతుల్లో రాయ్ అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ జోడీ మరింత ప్రమాదకరంగా మారుతుందా అనుకున్న తరుణంలో విశాక్ ఒకే ఓవర్లో నాలుగు బంతుల తేడాతో జగదీశన్, రాయ్ను ఔట్ చేశాడు. జగదీశ్న్..విల్లేకు క్యాచ్ ఇవ్వగా, రాయ్ క్లీన్బౌల్డ్గా వెనుదిరిగాడు. వీరిద్దరి నిష్క్రమణతో స్కోరు ఒకింత మందగించినా..కెప్టెన్ నితీశ్ రానా(48), వెంకటేశ్ అయ్యర్(31) అదే దూకుడు కొనసాగించేందుకు ప్రయత్నించారు. అయితే 5, 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ల వద్ద రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రానా..హర్షల్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో రెండు భారీ సిక్స్లు కొట్టి గేర్ మార్చాడు. అదే ఊపులో విశాక్ను రానా రెండు ఫోర్లు, ఒక సిక్స్తో అరుసుకున్నాడు. 18వ ఓవర్ బౌలింగ్ చేసిన హసరంగ బంతి తేడాతో రానాతో పాటు అయ్యర్ను పెవిలియన్ పంపి ఆర్సీబీ శిబిరంలో ఆనందం నింపాడు. మరోవైపు రింకూసింగ్(18 నాటౌట్)..సిరాజ్ వేసిన 19వ ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్, ఫోర్ కొట్టగా, రస్సెల్(1) క్లీన్బౌల్డ్ అయ్యాడు. ఆఖర్లో వీజ్ రెండు సిక్స్లతో కోల్కతా 200 మార్క్ అందుకుంది.
కోల్కతా: 20 ఓవర్లలో 200/5 (రాయ్ 56, రానా 48, హసరంగ 2/24, వైశాక్ 2/41), బెంగళూరు: 20 ఓవర్లలో 179/8(కోహ్లీ 54, లామ్రోర్ 34, చక్రవర్తి 3/27, సుయాశ్ శర్మ 2/30)