భారత క్రికెట్ జట్టులో చెలరేగినఅలజడి కొత్త మలుపులు తిరుగుతున్నది. విరాట్ కోహ్లీ ఎదురుదాడితో ఒక్కసారిగా వేడెక్కిన వాతావరణం బీసీసీఐని ఒకరకంగా ఆత్మరక్షణలో పడేసింది. టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగే విషయంలో బీసీసీఐ చీఫ్ గంగూలీ వ్యాఖ్యలకు విరుద్ధంగా స్పందించిన కోహ్లీ.. వన్డే కెప్టెన్సీపై కుండబద్దలు కొట్టడంతో బోర్డు స్పందించక తప్పలేదు. కోహ్లీ వ్యవహారాన్ని బోర్డుకు వదిలేయండని దాదా స్పష్టం చేశాడు. దీనిపై ఎలాంటి మీడియా సమావేశం కానీ..ప్రకటన ఉండదని పేర్కొన్నాడు. మరోవైపు ప్రస్తుతం బోర్డులో నెలకొన్న పరిస్థితులపై స్పందించేందుకు గంగూలీ సరైన వ్యక్తి అని గవాస్కర్ వ్యాఖ్యానిస్తే..దక్షిణాఫ్రికాతో కీలక సిరీస్కు ముందు వివాదాలకు ఇది సరైన సమయం కాదని దిగ్గజ ఆల్రౌండర్ కపిల్దేవ్ సూచించాడు.
న్యూఢిల్లీ: బీసీసీఐ, విరాట్ కోహ్లీ ఎపిసోడ్లో మరో కీలక పరిణామం. దక్షిణాఫ్రికాతో సిరీస్కు ముందు జరిగిన విరాట్ మీడియా భేటీ ప్రకంపనలు రేపుతున్న తరుణంలో బీసీసీఐ తప్పనిసరై స్పందించింది. మీడియా సమావేశంలో ఒకరకంగా బోర్డు వైఖరిని ఎండగడుతూ కోహ్లీ ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం బోర్డు పెద్దలకు తలనొప్పిగా మారింది. బీసీసీఐ నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందన్న తరుణంలో అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పొడిపొడి మాటలతో వివాదం సద్దుమణిగించేందుకు ప్రయత్నించాడు. విరాట్ వైఖరిపై దాదాపు అదే రీతిలో స్పందిస్తుందనుకున్న బీసీసీఐ అందుకు విరుద్ధంగా పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగా గురువారం.. గంగూలీ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ‘ఎలాంటి ప్రకటనల్లేవు, మీడియా సమావేశాల్లేవు. మేము చూసుకుంటాం. ఈ విషయాన్ని బోర్డుకు వదిలేయండి’ అని అన్నాడు.
బీసీసీఐ ఆచితూచి: టీ20 కెప్టెన్సీకి రాజీనామాతో పాటు వన్డే నాయకత్వం వేటు విషయంలో బోర్డుపై విరాట్ కోహ్లీ ఎదురుదాడి నేపథ్యంలో బీసీసీఐ ఆచితూచి వ్యవహరిస్తున్నది. కోహ్లీ మీడియా భేటీపై బుధవారం బోర్డు చీఫ్ గంగూలీ, కార్యదర్శి జైషాతో పాటు ఆఫీస్ బేరర్లు ‘జూమ్’లో సమావేశమైనట్లు తెలిసింది. ముఖ్యంగా బోర్డు వైఖరిని తీవ్రంగా తప్పుబట్టిన కోహ్లీ విషయంలో పత్రికా ప్రకటన చేయవద్దని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అధ్యక్ష హోదాకు ముడిపడి ఉన్న సున్నితమైన విషయం కావున దీనిపై నిపుణుల అభిప్రాయాన్ని తీసుకోవాలని బోర్డు చూస్తున్నది. దీనికి తోడు దక్షిణాఫ్రికాతో కీలకమైన టెస్టు సిరీస్కు ముందు ఏం నిర్ణయం తీసుకున్నా.. జట్టు నైతిక స్థితిని దెబ్బతీసినట్లు అవుతుందని అందుకే ఒకరకంగా వెనుకకు తగ్గినట్లు బోర్డు సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
టెస్టు సిరీస్ గెలిస్తే: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ గెలిస్తే…కెప్టెన్గా కోహ్లీకి మరింత బలం పెరుగవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా సఫారీ గడ్డపై టీమ్ఇండియా చరిత్ర సృష్టిస్తే అది కచ్చితంగా కోహ్లీకి కలిసి వస్తుంది. దీనికి తోడు ఫామ్లేమితో సతమతమవుతున్న కోహ్లీ..సెంచరీలతో చెలరేగితే అది కూడా లాభిస్తుంది. ఈ నేపథ్యంలో ఎదురుదాడికి దిగితే మొదటికే మోసం వస్తుందన్న ఆలోచనలో ఉన్న బోర్డు ఇది సరైన సమయం కాదని ఆలోచిస్తున్నది.
సమస్యకు సానుకూల ముగింపు పలకాలంటే కలిసి కూర్చుంటే సరిపోతుందని బోర్డు వ్యవహారాలను దగ్గర నుంచి చూస్తున్న కొందరు పేర్కొన్నారు. కెప్టెన్సీ మార్పు విషయంలో నెలకొన్న వివాదంపై కోహ్లీతో గంగూలీ లేదా జైషా మాట్లాడితే సమస్య సద్దుమణిగే అవకాశముంది. వాస్తవానికి ఆఫీస్ బేరర్లు తీసుకునే నిర్ణయాలపై సెంట్రల్ కాంట్రాక్టులో ఉన్న వాళ్లు మాట్లాడే అవకాశముండదు. కానీ కోహ్లీ విషయంలో వేరే జరిగింది. ఒక రకంగా బోర్డు నిబంధనలకు విరుద్ధంగా విరాట్.. బీసీసీఐ వైఖరిని తప్పుబట్టాడు. కావున ఈ సమస్యకు సులువైన పరిష్కారం లేదు. ఇదిలా ఉంటే గంగూలీతో పాటు కోహ్లీ గత దశాబ్ద కాలంగా మీడియాను హ్యాండిల్ చేస్తూ వస్తున్నారు. కోహ్లీ ముఖ్యంగా మూడు అంశాలపై బోర్డును ఇరకాటంలో పెట్టాడు.
ప్రస్తుతం సఫారీ పర్యటన సమయంలో ఎవరినీ వేలెత్తి చూపడం సరికాదు. దక్షిణాఫ్రికా పర్యటనపై దృష్టి పెట్టాలి. బీసీసీఐ అధ్యక్ష పదవి ఎంత గొప్పదో.. టీమ్ఇండియాకు కెప్టెన్ కూడా అంతే గొప్పది. బహిరంగంగా పరస్పరం చెడుగా మాట్లాడుకోవడం మంచి పద్ధతి కాదు. అది గంగూలీ అయినా.. కోహ్లీ అయినా! వెంటనే పరిస్థితిని అదుపులోకి తెచ్చి.. ఇప్పుడు దేశం గురించి ఆలోచించాలి. -కపిల్ దేవ్
కెప్టెన్సీ మార్పుపై విరాట్ కోహ్లీ వ్యాఖ్యలపై స్పందించేందుకు సరైన వ్యక్తి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. కెప్టెన్సీ విషయంలో ఏర్పడిన వివాదానికి ఆయన ముగింపు పలకాలి. ఎందుకంటే అంతర్గతంగా ఏం జరిగిందన్న విషయంలో బోర్డులో కీలక వ్యక్తులకు తెలుస్తాయి. అసలు వివాదం ఏంటీ? సెలెక్షన్ కమిటీ చైర్మన్..వన్డే కెప్టెన్సీకి నిన్ను(కోహ్లీ) పరిశీలనలోకి తీసుకోవడం లేదు అని చెప్పాక..ఇక అంతకుమించి ఏం ఉంటుంది. – గవాస్కర్