Kevin Pietersen : పొట్టి క్రికెట్లో ఈమధ్యే మొదలైన దక్షిణాఫ్రికా లీగ్ (ఎస్ఏ 20 లీగ్)పై మాజీ క్రికెటర్లు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే.. ఈ లీగ్లో ఒక జట్టును సొంతం చేసుకునేందుకు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ సిద్ధపడుతున్నాడు. తాను కూడా పోటీలో ఉన్నట్లు అతను తెలిపాడు. ‘అవును.. నేను ఒక బిడ్డర్ను. నేను ఒక ఒక టీమ్ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నా. కానీ, ఒక జట్టును కొనేందుకు సరిపడా డబ్బు నా దగ్గర లేదు’ అని అతను వెల్లడించాడు. ఆరు జట్లలో ఒక దానికి యజమాని అయ్యే అవకాశం రావాలే గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులు కోను అని అంటున్నాడు.
‘నాకు దక్షిణాఫ్రికా టీ20 లీగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. అయితే.. అది సాధ్యం అవుతుందో, లేదో అనేది చెప్పలేను’ అని పీటర్సన్ అన్నాడు. ప్రస్తుతం అతను దక్షిణాఫ్రికాలోని స్పోర్ట్స్ 18 ఛానెల్లో కామెంటేటర్గా విధులు నిర్వహిస్తున్నాడు.
దక్షిణాఫ్రికా లీగ్ విజయవంతం కావడం పట్ల పీటర్సన్ చాలా సంతోషంగా ఉన్నాడు. అంతేకాదు ఆ లీగ్లోని కొత్త నియమాలను అతను మెచ్చుకున్నాడు. ఈ లీగ్లో నియమాలు చాలా చాలా బాగున్నాయి. బోనస్ పాయింట్లు అనేవి చాలా గొప్ప ఆలోచన. అంతేకాదు మ్యాచ్ ఫలితంపై టాస్ ప్రభావం పెద్దగా ఉండదు. ఆటను ఎంటర్టైన్మెంట్గా మార్చేందుకు నియమాలు మార్చాలని నేను అంటాను. ఎందుకు అలా చేయకూడదు? ఆటలో మార్పులు చేస్తూ ఉండాలి. ఆటగాళ్లను మునివేళ్లపై నిలబెట్టాలి’ అని పీటర్సన్ అన్నాడు. ఎస్ఏ 20 లీగ్లో ప్రత్యర్థి జట్టుపై1.25 రన్ రేటుతో గెలిచిన టీమ్కు బోనస్ పాయింట్ ఇవ్వాలనే రూల్ ఉంది. అంతేకాదు టాస్కు ముందు కెప్టెన్లు 13 మంది ఆటగాళ్లను నామినేట్ చేసి, వాళ్లలో 11 మందిని సెలక్ట్ చేసుకొనే వీలుంది.