భారత్ లో చెస్ పేరు చెబితే టక్కున గుర్తొచ్చే పేరు విశ్వనాథన్ ఆనంద్. కానీ గత కొంతకాలంగా ఆనంద్తో పాటు యువ గ్రాండ్ మాస్టర్లు విశ్వవేదికపై సంచలన విజయాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో ప్రజ్ఞానంద రన్నరప్గా నిలవగా తాజాగా మరో భారత కుర్రాడు కార్తికేయన్ మురళి.. వరల్డ్ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్సన్ను మట్టికరిపించాడు. విశ్వనాథన్ ఆనంద్, హరికృష్ణ తర్వాత కార్ల్సన్ను ఓడించిన మూడో భారతీయ చెస్ క్రీడాకారుడిగా రికార్డులకెక్కాడు.
ఖతార్ వేదికగా జరుగుతున్న ఖతార్ మాస్టర్స్లో భాగంగా ఏడో రౌండ్లో కార్తికేయన్.. కార్ల్సన్ను ఓడించాడు. తమిళనాడులోని తంజావూరుకు చెందిన 24 ఏండ్ల ఈ కుర్రాడు.. నల్లపావులతో బరిలోకి దిగి వరల్డ్ నెంబర్ వన్ను మట్టికరిపించాడు. గతంలో భారత్ నుంచి విశ్వనాథన్ ఆనంద్, హరికృష్టలు మాత్రమే కార్ల్సన్ను ఓడించారు.
హరికృష్ట 2005లో కార్ల్సన్ను ఓడించాడు. అప్పటికీ అతడి వయసు 14 సంవత్సరాలు మాత్రమే. సీనియర్ లెవల్లో అయితే విశ్వనాథన్ (2022 నార్వే చెస్ టోర్నీలో) ఒక్కడే కార్ల్సన్ను ఓడించాడు. తాజా విజయంతో కార్తికేయన్ వారి సరసన చేరాడు. తంజావూరుకు చెందిన కార్తికేయన్.. గతంలో రెండు సార్లు నేషనల్ ఛాంపియన్. ఫిడే ర్యాంకింగ్స్లో అతడు 163వ స్థానంలో ఉన్నాడు.