Asian Athletics | బ్యాంకాక్: భారత యువ అథ్లెట్ జ్యోతి ఎర్రాజి.. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పసిడి పతకంతో మెరిసింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో ఈ తెలుగమ్మాయి 13.09 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానం దక్కించుకుంది. జ్యోతికి ఇదే తొలి మేజర్ ఇంటర్నేషనల్ స్వర్ణం కావడం విశేషం. జపాన్కు చెందిన అసుక (13.13 సెకన్లు), మాసుమి (13.26 సె.) వరుసగా రజత కాంస్యాలు దక్కించుకున్నారు. ఈ పోటీల్లో గురువారం జ్యోతి భారత పసిడి ఖాతా తెరువగా.. అజయ్ కుమార్, అబ్దుల్లా అబూబకర్ కూడా బంగారు పతకాలు గెలిచారు. పురుషుల 1500 మీటర్ల పరుగులో అజయ్ 3 నిమిషాలా 41 సెకన్లలో గమ్యాన్ని చేరగా.. ట్రిపుల్ జంప్లో అబూబకర్ 16.92 మీటర్లు లంఘించి బంగారు పతకం చేజిక్కించుకున్నాడు. మహిళల 400 మీటర్ల విభాగంలో ఐశ్వర్య మిశ్రా, పురుషుల డెకాథ్లాన్లో తేజస్విన్ శంకర్ కాంస్య పతాకలు సాధించారు. దీంతో చాంపియన్షిప్ రెండో రోజు భారత్ ఖాతాలో ఐదు పతకాలు చేరాయి.
అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలనే లక్ష్యంతో బరిలోకి దిగా. వర్షం కారణంగా అనుకున్న టైమింగ్ నమోదు చేయలేకపోయా. ఈ ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా.. ఇక్కడితో ఆగిపోను. తీవ్ర పోటీ ఉండే ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో స్వర్ణం నెగ్గడం ఆనందంగా ఉంది.
-జ్యోతి ఎర్రాజి