మిర్పూర్: సిరీస్లో నిలువాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. సిరీస్లో 0-1తో వెనుకంజలో ఉన్న టీమ్ఇండియా కీలకమైన రెండో వన్డేలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. బుధవారం జరిగిన రెండో వన్డేలో భారత్ 108 పరుగుల తేడాతో బంగ్లాపై భారీ విజయం సాధించింది. టీమ్ఇండియా నిర్దేశించిన 229 పరుగుల లక్ష్యఛేదనలో జెమీమా రోడ్రిగ్స్(4/3), దేవికా వైద్య(3/30) ధాటికి బంగ్లా 35.1 ఓవర్లలో 120 పరుగులకు కుప్పకూలింది. ఫర్గనా హక్(47) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ రోడ్రిగ్స్, వైద్య వరుస విరామాల్లో బంగ్లా వికెట్లను పడగొట్టారు. ముఖ్యంగా రోడ్రిగ్స్ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్ల పనిపట్టింది. అంతకుముందు రోడ్రిగ్స్(86), కెప్టెన్ హర్మన్ప్రీత్కౌర్(52) అర్ధసెంచరీలతో భారత్ 50 ఓవర్లలో 228/8 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలమైన వేళ రోడ్రిగ్స్, కౌర్ సాధికారిక ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నారు. సుల్తానా, నదియా రెండేసి వికెట్లు తీశారు. ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న రోడ్రిగ్స్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.