Bumrah : శ్రీలంకతో తొలి వన్డేకు ముందు టీమిండియాకు షాక్.. భారత స్పీడ్స్టర్ జస్ప్ప్రీత్ బుమ్రా మూడు వన్డేల సిరీస్కు దూరం కానున్నాడు. అతనికి విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావించడమే అందుకు కారణం. వెన్నెముక గాయం నుంచి కోలుకున్న బుమ్రాకు జాతీయ క్రికెట్ అకాడమీ ఈమధ్యే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చింది. దాంతో, చేతన్శర్మ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ జనవరి 3న వన్డే సిరీస్కు బుమ్రాను 17 ఆటగాడిగా ఎంపిక చేశారు. అయితే.. బీసీసీఐ యూ టర్న్ తీసుకుంది. అతడిని ఆడించే విషయంలో తొందరపాటు వద్దని నిర్ణయించుకుంది ఎందుకంటే.. పోయిన ఏడాది ఫిట్నెస్ సాధించి జట్టులోకి వచ్చిన బుమ్రా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో మళ్లీ వెన్నునొప్పితో బాధపడ్డాడు. దాంతో టీ20 వరల్డ్ కప్కు దూరమయ్యాడు. అందుకని ఈ స్టార్ పేసర్ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు అనుకుంటోంది. మరింత విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతో వన్డే సిరీస్ నుంచి తప్పించనుంది. శ్రీలంక, భారత్ జట్ల మధ్య తొలి వన్డే రేపు గువాహటిలో జరగనుంది.
టీమిండియా కీలక బౌలర్ అయిన బుమ్రా 2022 అక్టోబర్ నుంచి క్రికెట్కు దూరంగా ఉన్నాడు. అతను ఫిబ్రవరిలో స్వదేశంలో జరగనున్న ఆస్ట్రేలియా సిరీస్లో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇరుజట్లు బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 4 టెస్టు మ్యాచ్లు ఆడనున్నాయి. ఆ తర్వాత ఐపీఎల్ టోర్నమెంట్ మొదలుకానుంది. ఈ ఏడాది రెండు ఐసీసీ ట్రోఫీలు ఉన్నాయి. టెస్టు ఛాంపియన్ షిప్, వన్డే వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీల్లో బుమ్రా కీలకం కానున్నాడు. అందుకని ఈ స్టార్ పేసర్ ఫిట్గా ఉండడం భారత్కు చాలా ముఖ్యం. కాబట్టే అతడి ఆరోగ్యం విషయంలో బీసీసీఐ అంతగా శ్రద్ధ తీసుకుంటోంది.