IPL-2022 |ఇంగ్లండ్ ఓపెనింగ్ బ్యాట్స్మన్ జేసన్ రాయ్ మళ్లీ ఐపీఎల్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. తాజాగా నూతన ఫ్రాంచైసీ గుజరాత్ టైటాన్స్ జట్టుకు గట్టి షాక్ ఇచ్చాడు. ఈ నెల 26 నుంచి ఐపీఎల్ టోర్నీ ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత సీజన్లో మెగా టోర్నీకి కూడా గుడ్బై చెబుతున్నట్లు గత వారమే యాజమాన్యానికి సమాచారం ఇచ్చాడని సమాచారం. జేసన్ రాయ్ స్థానంలో ఫ్రాంచైసీ మరెవ్వరినీ ఎంపిక చేయలేదు.
గతనెల జరిగిన మెగా వేలంలో గుజరాత్ యాజమాన్యం కనీస ధర రూ.2కోట్లకు జేసన్ రాయ్ను కొనుగోలు చేసింది. దీంతో ఈ నెల నుంచి మొదలయ్యే ఐపీఎల్ సంరంభంలో జేసన్ రాయ్ ఆ జట్టు తరఫున ఓపెనర్గా బరిలోకి దిగుతాడని అంతా భావించారు. 2 నెలలు సాగే ఐపీఎల్ టోర్నీలో అంతకాలం బయోబబుల్లో గడపడం కష్టమని భావించాడని సమాచారం.
ఇంతకుముందు జేసన్రాయ్ 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్ ఆయన్ను రూ.1.5 కోట్ల (బేసిక్ ప్రైస్)కు కొనుగోలు చేసింది. కానీ వ్యక్తిగత కారణాలతో ఆ ఏడాది టోర్నీ నుంచి నిష్క్రమించాడు. 2018లో ఢిల్లీ క్యాపిటల్, 2021లో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్ల తరఫున ఆడినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.