హిస్సార్: మహిళల జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ బాక్సర్ నిహారిక ముందంజ వేసింది. శుక్రవారం జరిగిన 63కిలోల బౌట్లో నిహారిక 5-0 తేడాతో డాలీసింగ్(బీహార్)పై అలవోక విజయం సాధించింది. ఆది నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన నిహారిక…ప్రత్యర్థిపై పదునైన పంచ్లతో విరుచుకుపడింది. ఎక్కడా తడబాటుకు లోనుకాని ఈ యువ బాక్సర్.. రిఫరీల దృష్టిని ఆకర్షించింది. మరోవైపు శనివారం జరిగే రెండో రౌండ్ బౌట్లో స్టార్ బాక్సర్ నిఖత్జరీన్..ఢిల్లీ బాక్సర్ పూజతో తలపడుతుంది. మరో పోరులో మానస మట్టపర్తి..జాస్మైన్(హర్యానా)ను ఎదుర్కొంటుంది. ఇదిలా ఉంటే ఆసియా మాజీ చాంపియన్ పూజ రాణి(81కి), జాస్మైన్(60కి) టోర్నీలో రెండో రౌండ్లోకి ప్రవేశించారు. పూజ 5-0తో పింకీపై అలవోక విజయాన్నందుకుంది. ఈ టోర్నీలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 320 మందికి పైగా బాక్సర్లు పోటీపడుతున్నారు.