Irfan Pathan : టెస్టుల్లో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫామ్ ఆందోళన కలిగిస్తోందని మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. స్టార్ స్పోర్ట్స్ ‘గేమ్ ప్లాన్’ షోలో మాట్లాడుతూ.. 2020 నుంచి ఇప్పటి వరకూ టెస్టుల్లో కోహ్లీ సాధించిన పరుగులు చూస్తే ఆందోళన కలుగుతోందని అన్నాడు. ‘ప్రపంచంలోనే మేటి క్రికెటర్, మూడు ఫార్మాట్లలో దాదాపు 25 వేల పరుగులు చేసిన కోహ్లీ లాంటి ఆటగాడు తక్కువ స్కోర్ చేయడం బాధాకరం’ అని ఇర్ఫాన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అంతేకాదో కోహ్లీ స్పిన్నర్లను ఎదర్కోవడంలో ఇబ్బంది పడుతున్నాడని వెల్లడించాడు.
లియాన్ను ఎదుర్కొనేందుకు..
‘కోహ్లీ ఈమధ్య స్పిన్నర్ల బౌలింగ్లో ఆడడంలో తడబడుతున్నాడు. స్పిన్ విషయంలో అతని స్ట్రయిక్ రేటు చాలా తక్కువ ఉంది. త్వరలోనే ఆస్ట్రేలియా సిరీస్లో నాథన్ లియాన్, అగర్ లాంటి టాప్ స్పిన్నర్లను అతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నా సలహా ఏంటంటే… వీరిద్దరి బౌలింగ్లో కోహ్లీ దూకుడుగా ఆడాలి’ అని ఇర్ఫాన్ అన్నాడు. ఇప్పటివరకూ టెస్టుల్లో కోహ్లీని లియాన్ 7 సార్లు ఔట్ చేశాడు. అయితే.. కోహ్లీ ఇప్పుడు సూపర్ ఫామ్లో ఉన్నాడు. స్వదేశంలో ఇప్పటికే శ్రీలంక సిరీస్లో రెండు సెంచరీలు బాదాడు. అతను అదే ఫామ్ కొనసాగిస్తే బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్ బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయం.
అత్యధిక స్కోర్ 79
మూడేళ్ల క్రితం ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ తర్వాత కోహ్లీ టెస్టుల్లో పెద్దగా రాణించలేదు. ఫామ్ కోల్పోయిన కోహ్లీ ఈ ఫార్మాట్లో ఒక్క సెంచరీ కూడా కొట్టలేదు. ఈ మూడేళ్లలో 20 టెస్టులు ఆడిన విరాట్ 917 రన్స్ చేశాడంతే. అది కూడా 26.20 సగటుతో. గత ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాపై చేసిన 79 పరుగులు కోహ్లీ అత్యధిక స్కోర్ కావడం విశేషం.