దుబాయ్: వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్లో మొత్తం పది జట్లు పోటీ పడనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్టార్ ఆటగాళ్లందరూ వేలంలో పాల్గొంటారని వార్తలు వచ్చాయి. అయితే పాత జట్ల యాజమాన్యాలు మాత్రం కొంతమంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుందని, అయితే ఎంతమందిని అనేది మాత్రం చెప్పలేమని అంటూ వచ్చాయి.
ఈ క్రమంలో తాజాగా వినిపిస్తున్న వార్తలు ఆసక్తికరంగా మారాయి. ఐపీఎల్లో ఇప్పటికే ఉన్న జట్లు తమ టీమ్స్ నుంచి నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశాన్ని ఐపీఎల్ యాజమాన్యం కల్పిస్తుందట. అలాగే వేలంలో ఉండే ఆటగాళ్లలో ముగ్గురిని కొత్త జట్లు ఎంపిక చేసుకునే ఛాన్స్ ఇస్తుందట.
పాత జట్లు రిటైన్ చేసుకునే ఆటగాళ్లలో ఇద్దరు భారతీయ ప్లేయర్లు, ఇద్దరు విదేశీ ప్లేయర్లు లేదా ముగ్గురు ఇండియన్స్, ఒక విదేశీయుడు ఉండొచ్చట. అలాగే జట్ల బడ్జెట్ రూ.90 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం. ఫ్రాంచైజీలకు రైట్ టు మ్యాచ్ కార్డు అవకాశాలు ఉండవని తెలుస్తోంది.
ఇటీవల ముగిసిన బిడ్డింగ్ ప్రక్రియ ప్రకారం లక్నో, అహ్మదాబాద్ సిటీల నుంచి కొత్త జట్లు రానున్నాయి. వీటిలో లక్నో జట్టును ఆర్పీఎస్జీ వెంచర్స్ లిమిటెడ్, అహ్మదాబాద్ ఫ్రాంచైజీని సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ భారీ మొత్తాలకు చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.