దుబాయ్లో నిర్వహించిన ఐపీఎల్ వేలంపాటలో కంగారూ క్రికెటర్లపై కనకవర్షం కురిసింది. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ కండ్లు చెదిరే ధర పలికారు. స్టార్క్ను 24.75 కోట్లకు కోల్కతా నైట్రైడర్స్ వశం చేసుకోగా, కమిన్స్ను సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ 20.50 కోట్లకు దక్కించుకున్నది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్ అని ఎందుకు అంటారో మరోసారి నిరూపితమైంది. ఒక్క సీజన్ కోసం మాత్రమే నిర్వహించిన ఐపీఎల్ మినీ వేలంలో.. కంగారూల పంట పండింది. వన్డే ఫార్మాట్లో ఆరోసారి జగజ్జేతలుగా నిలిచిన ఆసీస్ ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. దీంతో లీగ్ చరిత్రలోని అన్నీ రికార్డులు బద్దలయ్యాయి.
ఆసీస్ ఏస్ పేసర్ మిషెల్ స్టార్క్ కోసం కోల్కతా నైట్ రైడర్స్ ఏకంగా రూ.24.75 కోట్లు వెచ్చించింది. ఇది కొన్ని దేశాల్లో నిర్వహిస్తున్న క్రికెట్ లీగ్లలో మొత్తం జట్టు విలువ కంటే ఎంతో ఎక్కువ. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ కంగారూ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కోసం రూ. 20.50 కోట్లు పెట్టింది. భారత ఆటగాళ్లలో హర్షల్ పటేల్ 11.75 కోట్లతో టాప్లో నిలువగా.. అన్క్యాప్డ్ ప్లేయర్ సమీర్ రిజ్వీ కోసం చెన్నై రూ.8.40 కోట్లు ఖర్చు చేసింది. తెలంగాణ కుర్రాడు అవనీశ్రావును చెన్నై దక్కించుకుంది. మొత్తంగా తమకు అవసరమైన ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు కోట్లకు కోట్లు కుమ్మరించాయి.
దుబాయ్: ఆస్ట్రేలియా పేసర్ మిషెల్ స్టార్క్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఎనిమిదేండ్ల క్రితం ఐపీఎల్లో ఆడిన స్టార్క్.. తాజాగా ఆస్ట్రేలియా జట్టు వన్డే ప్రపంచకప్ గెలువడంలో కీలక పాత్ర పోషించి ఫుల్ జోష్లో ఉండటంతో అతడిని దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. చివరకు రూ.24.75 కోట్లకు కోల్కతా నైట్ రైడర్స్ స్టార్క్ను దక్కించుకుంది. ఇక ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ను హైదరాబాద్ జట్టు రూ. 20.50 కోట్లకు కొనుగోలు చేసుకుంది. వీరిద్దరి కోసం పోటీపడిన ఫ్రాంచైజీలు అదే ఆస్ట్రేలియాకు చెందిన మరో పేసర్ హజిల్వుడ్ను పట్టించుకోకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కరన్ కోసం పంజాబ్ కింగ్స్ వెచ్చించిన రూ.18.50 కోట్లే లీగ్లో అత్యధికం కాగా.. ఈ సారి ఇద్దరు ఆసీస్ ప్లేయర్లు ఆ మార్క్ దాటి కొత్త రికార్డు నెలకొల్పారు. గత కొన్ని సీజన్లుగా సరైన ప్రదర్శన కనబర్చలేక నిరాశ పరుస్తున్న సన్రైజర్స్ యాజమాన్యం ఈ సారి వేలంలో భారీ ఖర్చు పెట్టి కీలక ఆటగాళ్లను చేజిక్కించుకుంది.
భారత ఆటగాళ్లలో హర్షల్ పటేల్ను రూ.11.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసుకోగా.. అల్జారీ జోసెఫ్ కోసం బెంగళూరు రూ.11.50 కోట్లు ఖర్చుపెట్టింది. గుజరాత్ టైటా న్స్ స్పెన్సర్ జాన్స్నుకు రూ. 10 కోట్లు వెచ్చించగా.. శివమ్ మావిని రూ. 6.40 కోట్లు పెట్టి లక్నో సొంతం చేసుకుంది. ఉమేశ్ యాదవ్ రూ. 5.80 కోట్లు (గుజరాత్) ధర పలకగా.. కోట్జీకి ముంబై రూ.5 కోట్లు పెట్టింది. అందరూ అనుకున్నట్లే శార్దూల్ ఠాకూర్ను రూ. 4 కోట్లకు చెన్నై సొంతం చేసుకుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ సారి బౌలర్ల కోసమే ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. నాణ్యమైన పేసర్లపై ఎంత ఖర్చు పెట్టేందుకైనా జట్లు వెనకాడలేదు.
న్యూజిలాండ్ ప్లేయర్ డారిల్ మిషెల్ కోసం చెన్నై రూ. 14 కోట్లు పెట్టడం ఒక్కటే కాస్త ఆశ్చర్యం కాగా.. వన్డే ప్రపంచకప్ ఫైనల్ హీరో ట్రావిస్ హెడ్ను హైదరాబాద్ రూ. 6.80 కోట్లకు దక్కించుకుంది. ఉనాద్కట్ను రూ.1.60 కోట్లు, వణిండు హసరంగను రూ.1.50 కోట్లకు సన్రైజర్స్ కొనుగోలు చేసుకుంది. రూ.50 లక్షలతో వేలంలోకి వచ్చిన న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్రను రూ.1.8 కోట్లకు చెన్నై సొంతం చేసుకుంది. రూ.7.40 కోట్లు పెట్టి రాజస్థాన్ రావ్మన్ పావెల్ కొనుక్కోగా.. ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ను ఢిల్లీ 4 కోట్లకు కొనుక్కుంది.
ఇటీవల అండర్-19 ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన తెలంగాణ కుర్రాడు అరవెల్లి అవనీశ్ రావుకు ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కింది. కనీస ధర రూ.20 లక్షలకు అవనీశ్ను చెన్నై సొంతం చేసుకుంది. హైదరాబాద్ కుర్రాడు తనయ్ త్యాగరాజన్ను రూ.20 లక్షలకు పంజాబ్ దక్కించుకోగా.. తెలుగు ఆటగాడు కేఎస్ భరత్ను కోల్కతా రూ.50 లక్షలు పెట్టి కొనుక్కుంది.
వేలంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకునే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని ఒక భారత ఆటగాడి కోసం భారీ ధర చెల్లించింది. ఉత్తరప్రదేశ్కు చెందిన 20 ఏండ్ల సమీర్ రిజ్వీని చెన్నై రూ. 8.40 కోట్లు పెట్టి కొనుగోలు చేసుకుంది. దేశవాళీల్లో భారీ సిక్సర్లతో విజృంభిస్తున్న రిజ్వీ కోసం చెన్నై భారీ ధర పెట్టగా.. కుమార కుషాగ్రను రూ.7.20 కోట్లు వెచ్చించి ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.
స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్, హజిల్వుడ్, కరుణ్ నాయర్, ఫిల్ సాల్ట్, కుషాల్ మెండిస్, ఆదిల్ రషీద్, ఇష్ సోధి, తబ్రేజ్ షంసీ, మనన్ వోహ్రా, ఇషాన్ పొరెల్, ఫిన్ అలెన్, కొలిన్ మున్రో, డసెన్, నీషమ్, ఒడెన్ స్మిత్, చమీర, మ్యాట్ హెన్రీ, కైల్ జెమీసన్, మిల్స్, మిల్నే,
ఇది కలలో కూడా ఊహించలేదు. వేలంలో పలికిన ధర చూసి ఆశ్చర్యపోయా. ఇంత భారీ మొత్తం వెచ్చించినప్పుడు అంచనాల ఒత్తిడి కూడా అధికంగా ఉంటుందనేది వాస్తవం. గతంలో ఐపీఎల్ ఆడిన అనుభవాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నా. ధరకు న్యాయం చేసేందుకు వీలైనంత కృషిచేస్తా.
– మిషెల్ స్టార్క్