IPL 2024: క్రికెట్ అభిమానులను 16 సీజన్లుగా అలరిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చే సీజన్ శ్రీలంకలో జరుగనుందా..? మార్చి 22 (అధికారికంగా ప్రకటించలేదు) నుంచి మొదలవనున్న ఈ క్యాష్ రిచ్ లీగ్ను భారత్లో సాధారణ ఎన్నికల కారణంగా లంకకు తరలిస్తున్నారా..? ఇటీవల లంక క్రీడా శాఖ మంత్రి హరిన్ ఫెర్నాండో.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెక్రటరీ జై షాతో సమావేశం అవడం ఈ అనుమానాలకు తావిస్తోంది. దేశంలో ఇప్పటికే సాధారణ ఎన్నికల ఫీవర్ మొదలుకాగా ఫిబ్రవరి లేదా మార్చిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సుమారు రెండునెలల పాటు సాగే ఈ ప్రక్రియలో ఐపీఎల్కు భద్రత కల్పించడం భద్రతాదళాలకు కత్తిమీద సాము వంటిదే. ఈ నేపథ్యంలో కొన్ని మ్యాచ్లను శ్రీలంకలో నిర్వహించేందుకు అవకాశమివ్వాలని, అందుకు తగిన ఏర్పాట్లు తాము చేస్తామని లంక క్రీడా మంత్రి.. జైషాతో చర్చించినట్టు తెలుస్తున్నది.
జై షా ను కలిసిన ఫెర్నాండో కూడా ఇదే విషయాన్ని సుదీర్ఘంగా చర్చించారని.. ఆటగాళ్ల భద్రత, సౌకర్యాల వంటి విషయంలో లోటేమీ రాకుండా తాము చూసుకుంటామని భరోసా ఇచ్చినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మరి దీనిపై జై షా ఏం చెప్పారు..? లంకలో ఐపీఎల్ ఆడేందుకు బీసీసీఐ అంగీకరిస్తుందా..? అనేది తెలియాల్సి ఉంది.
ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ… ‘సాధారణ ఎన్నికలు జరిగే సమయంలోనే ఐపీఎల్ కూడా నిర్వహించాల్సి వస్తుంది. ఒకవేళ ఏదైనా రాష్ట్రం తమ రాష్ట్రంలో మ్యాచ్ ఆడేందుకు నిరాకరించినా (భద్రతా కారణాల దృష్ట్యా), అందుకు అనువైన పరిస్థితులు లేకున్నా మ్యాచ్ను ఇతర వేదికకు మారుస్తాం. లంకలో ఆడాలనేదానిపై మాత్రం ఇంకా ఎలాంటి చర్చ జరుగలేదు..’ అని అన్నాడు.
IPL 2024 is likely to be held in India despite elections. (ANI) pic.twitter.com/cjss7uUCu9
— CricketMAN2 (@ImTanujSingh) January 10, 2024
భారత్లో ఎన్నికలు జరిగిన సమయంలో ఐపీఎల్ను షిఫ్ట్ చేసిన సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి. 2009, 2014 ఎడిషన్స్ దేశంలో ఎన్నికల కారణంగా ఇతర దేశాల్లో ఆడించారు. 2009లో టోర్నీ మొత్తం సౌతాఫ్రికాలో జరుగగా 2014 ఎడిషన్ యూఏఈ లో నిర్వహించారు.