IPL-2024 | ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రెండు మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్లో ఐపీఎల్ పాలక మండలి మార్పులు చేసింది. కోల్కతాలోని ఈడెన్గార్డెన్స్లో ఏప్రిల్ 17న జరగాల్సిన కోల్కతా నైట్రైడర్స్ – రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ తేదీ మారింది. ఒక రోజు ముందుగానే అంటే ఏప్రిల్ 16న మ్యాచ్ జరుగనున్నది. గుజరాత్ టైటాన్ – ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉండగా.. కేకేఆర్ – రాజస్థాన్ మ్యాచ్ మారడంతో.. గుజరాత్, ఢిల్లీ మధ్య మ్యాచ్ ఏప్రిల్ 17న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. శ్రీరామ నవమి దృష్ట్యా ఐపీఎల్ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.
రామనవమి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇక ఏప్రిల్ 19 నుంచి బెంగాల్లో లోక్సభ ఎన్నికలు సైతం మొదలవనున్నాయి. ఈ నేపథ్యంలో కోల్కతా పోలీసులు మ్యాచ్కు భద్రత కల్పించలేమని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కేకేఆర్-ఆర్ఆర్ మ్యాచ్ తేదీ మార్పు జరుగనున్నది ప్రచారం జరిగింది. కోల్కతా పోలీసులు, బీసీసీఐ, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ మధ్య చర్చలు జరిగాయి. చివరకు మ్యాచ్ తేదీని మార్చాలని నిర్ణయించారు. కోల్కతా పోలీసులు క్యాబ్ ప్రెసిడెంట్ స్నేహాశిష్ గంగూలీకి లేఖ రాశారు.
ఈ మ్యాచ్ రామ నవమి రోజున జరుగుతోందని, ఎన్నికల కారణంగా భద్రత కల్పించలేమని చెప్పారు. ఇదిలా ఉండగా.. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీసీసీఐ ఐపీఎల్ 17వ సీజన్ షెడ్యూల్ను రెండు దఫాలుగా ప్రకటించింది. తొలుత ఈ టోర్నీలో 21 మ్యాచ్లకు.. ఆ తర్వాత 53 మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది. షెడ్యూల్ నిర్ణయించే సమయంలో ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకున్నది. ఇక లోక్సభ ఎన్నికలు ఏడు విడుతల్లో జరుగనున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 19న తొలిదశలో మొదలై.. జూన్ 1న చివరి దశతో ఓటింగ్ ముగుస్తుంది. జూన్ 4న ఫలితాలను ప్రకటించనున్నారు.