IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలానికి ముందే ఫ్రాంచైజీలకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫ్రాంచైజీల పర్స్ వాల్యూను పెంచుతున్నట్టు తెలుస్తున్నది. దుబాయ్ వేదికగా నిర్వహించబోయే ఈ మినీ వేలంలో ఒక్కో జట్టు పర్స్ వాల్యూను రూ. 100 కోట్లకు పెంచుతున్నట్టు సమాచారం. గతేడాది (రూ. 95 కోట్లు) తో పోలిస్తే ఇది రూ. 5 కోట్లు అధికం.
ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో లో వచ్చిన కథనం మేరకు.. డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా ఐపీఎల్ వేలం జరుగనుంది. దీనికంటే ముందే పది ఫ్రాంచైజీలు వచ్చే సీజన్లో తమతో పాటు అట్టిపెట్టుకునే (రిటైన్), వదిలించుకునే (రిలీజ్) ఆటగాళ్ల జాబితాను నవంబర్ 15 నాటికి అందించాలని బీసీసీఐ ఫ్రాంచైజీలను కోరినట్టు తెలుస్తున్నది. ఆటగాళ్ల రిటైన్, రిలీజ్ లిస్ట్ వచ్చాక ఏ జట్టు ఖాతాలో ఎంత నగదు ఉందనే వివరాలు వెల్లడవుతాయి.
ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ వద్ద రూ. 12.20 కోట్ల నగదుతో పర్స్లో అత్యధిక నగదు ఉన్న ఫ్రాంచైజీగా ఉండగా రూ. 0.05 కోట్లతో ముంబై చిట్టచివరన ఉంది. మిగతా టీమ్ల వివరాలకొస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ వద్ద రూ. 6.55 కోట్లు, గుజరాత్ టైటాన్స్ వద్ద రూ. 4.45 కోట్లు, లక్నో రూ. 3.55 కోట్లు, రాజస్తాన్ రూ. 3.35 కోట్లు, ఆర్సీబీ రూ. 1.75 కోట్లు, డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ. 1.5 కోట్ల నగదు ఉంది.
ఇక దుబాయ్లో జరుగబోయే ఈ మినీ వేలంలో పాల్గొనేందుకు ఈసారి పలువురు స్టార్ ప్లేయర్లు అమితాసక్తి చూపుతున్నారు. సుమారు నాలుగేండ్ల తర్వాత మిచెల్ స్టార్క్ వేలంలో పాల్గొనేందుకు సుముఖంగా ఉన్నాడు. అతడితో పాటు గతేడాది వ్యక్తిగత కారణాల వద్ద ఐపీఎల్కు దూరమైన ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ కూడా ఈసారి వేలంలోకి రానున్నాడు. అలెక్స్ హేల్స్, క్రిస్ వోక్స్, సామ్ బిల్లింగ్స్, గెరాల్డ్ కొయెట్జ్ (సౌతాఫ్రికా) లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.