ముంబై: ఐపీఎల్ సీజన్-16లో భాగంగా ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ప్రత్యర్థి ముంబై టీమ్ ముందు 186 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కోల్కతా ఓపెనింగ్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ ఇన్నింగ్స్ మొదటి నుంచి వీరవిహారం చేసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తం 51 బంతుల్లో 9 సిక్సులు, 6 ఫోర్లతో 104 పరుగులు చేసి రిలే మెరిడిట్ బౌలింగ్లో ఔటయ్యాడు.
ఆ తర్వాత కోల్కతా బ్యాటర్లలో అండ్రూ రస్సెల్ మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. 11 బంతులను ఎదుర్కొని 1 సిక్స్, 3 ఫోర్లతో 21 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత రింకూసింగ్, శార్దూల్ ఠాకూర్ తప్ప మరే బ్యాటర్ రెండంకెల స్కోరు చేయలేకపోయాడు. ముంబై బౌలర్లలో హృతిక్ శోకీన్ అద్భుతంగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు పడగొట్టాడు. నితీశ్ రాణా, శార్దూల్ ఠాకూర్ వికెట్లు శోకీన్ ఖాతాలోకి వెళ్లాయి.
ఇక, టీమిండియా మాజీ స్టార్ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఈ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేశాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన అర్జున్ రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 17 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అర్జున్కు బంతి ఇవ్వలేదు. ఇక రిలే మెరెడిట్, పీయూష్ చావ్లా, దువాన్ జాన్సెన్ నాలుగేసి ఓవర్లు బౌల్ చేసి ఒక్కో వికెట్ తీసుకున్నారు. కామెరూన్ గ్రీన్ రెండు ఓవర్లు వేసి ఒక వికెట్ పడగొట్టాడు.