IPL 2023 : కొచ్చిలో జరుగుతున్న ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఆల్రౌండర్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయారు. వేలంలో వీళ్లకే భారీ ధర దక్కింది. మ్యాచ్ విన్నర్లు అయిన ఆల్రౌండర్లను దక్కించుకునేందుకు ఫ్రాంఛైజీలు కోట్లు కుమ్మరించాయి. అత్యధిక ధర పలికిన టాప్ 3లో అందరూ ఆల్రౌండర్లే కావడం విశేషం. ఇంగ్లండ్ జట్టు టీ 20 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆల్రౌండర్ సామ్ కరన్ను పంజాబ్ కింగ్స్ రూ.18.50 కోట్లకు సొంతం చేసుకుంది. భారత పర్యటనలో, ఇంగ్లండ్ సిరీస్లో అదరగొట్టిన ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ వేలంలో కోట్లు కొల్లగొట్టాడు. అతడిని ముంబై ఇండియన్స్ రూ.17.50 కోట్లకు దక్కించుకుంది. 2019 వరల్డ్ కప్ హీరో బెన్స్టోక్స్ రూ.16.25 కోట్ల భారీ ధరకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. వెస్టిండీస్ ఆటగాడు జేసన్ హోల్డర్ రూ.5.75 కోట్లకు అమ్ముడుపోయాడు. వేలంలో అతడిని రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. జింబాబ్వేకు చెందిన రమీజ్ రజాను పంబాజ్ కింగ్స్ రూ.50 లక్షలకు సొంతం చేసుకుంది.
పోయిన ఏడాది వేలంలో న్యూజిలాండ్ ఆల్రౌండర్ కైల్ జేమీసన్ను రూ.15 కోట్ల భారీ ధరకు, అస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ను రూ.11 కోట్లు వెచ్చించి ఆర్సీబీ దక్కించుకుంది.2021లో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ క్రిస్ మోరిస్ అత్యధిక ధర పలికాడు. రూ. 16.25 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ అతడిని కొనుగోలు చేసింది. మోరిస్ రికార్డును సామ్ కరన్ (రూ.18.50కోట్లు)బ్రేక్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన అటగాడిగా సామ్ కరన్ రికార్డు సృష్టించాడు. 2015 వేలంలో టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ను రూ.16 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొన్నది.