Matheesha Pathirana : పొట్టి ప్రపంచకప్లో నాకౌట్ దశకు సమయం దగ్గర పడింది. లీగ్ దశలో మాదిరిగానే సూపర్ 8లోనూ అదరగొట్టాలని పట్టుదలతో ఉన్నాయి. అంతలోనే శ్రీలంకకు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే ప్రధాన పేసర్ ఇషాన్ మలింగ, స్పిన్నర్ వనిందు హసరంగ సేవల్ని కోల్పోయిన లంక.. నాకౌట్ దశకు ముందే యువ పేసర్ మథీశ పథిరన (Matheesha Pathirana) సేవల్ని కోల్పోనుంది. కాలి పిక్క కండరాలతో బాధ పడుతున్న పథిరన టోర్నీ నుంచి వైదొలిగాడని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ తెలిపాడు.
గ్రూప్ బీలోని శ్రీలంక లీగ్ దశ మూడో మ్యాచ్లో ఆస్ట్రేలియాతో తలపడింది. ఈ మ్యాచ్లోనే పథిరన ఎడమ కాలి నొప్పితో బాధపడ్డాడు. నాలుగు బంతులు వేసిన తర్వాత అతడు కాలు పట్టుకొని విలవిలలాడాడు. ఫిజియో వచ్చి పరీక్షించినా ఉపశనమం లేకపోవడంతో మైదానం వీడాడు. ఆ తర్వాత అతడు బౌలింగ్కు రాలేదు. దాంతో.. గాయం తీవ్రత పెద్దదే అనుకున్నారంతా. అనుకున్నట్టే.. పథిరన వరల్డ్కప్లో కీలక మ్యాచ్లకు అందుబాటులో ఉండడం లేదు. గురువారం జింబాబ్వేతో మ్యాచ్ ఉన్నందున బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మాట్లాడుతూ పథిరన ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చాడు.
A potential big blow for Sri Lanka 🤕
Matheesha Pathirana, who’d had gone down clutching his left leg during the game against Australia, is likely to be ruled out of the T20 World Cup after scans revealed a calf strain that may take several weeks to heal pic.twitter.com/kCR66IlCAk
— ESPNcricinfo (@ESPNcricinfo) February 18, 2026
‘ఆస్ట్రేలియాతో మ్యాచ్లో గాయపడిన పథిరన ఇంకా కోలుకోలేదు. టోర్నమెంట్లో తదుపరి మ్యాచ్లు ఆడేందుకు అతడు ఫిట్గా లేడు. వరల్డ్కప్ నుంచి పథిరన వైదొలిగాడని అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే శ్రీలంక క్రికెట్ ఈ విషయాన్ని వెల్లడిస్తుంది. ప్రస్తుతానికైతే అతడి స్థానంలో ఎవరిని తీసుకోవాలి? అనేది ఇంకా నిర్ణయించలేదు’ అని విక్రమ్ రాథోడ్ పేర్కొన్నాడు. యార్కర్లతో వికెట్లు పడగొట్టే పథిరన నాకౌట్ మ్యాచ్లకు దూరమవ్వడం ఆతిథ్య జట్టుకు పెద్ద లోటే. సూపర్ 8లో న్యూజిలాండ్, ఇంగ్లండ్, పాకిస్థాన్తో లంక తలపడనుంది.