INDvsSA 1st Test: దక్షిణాఫ్రికా మాజీ సారథి, భారత్ తో జరుగుతున్న రెండు మ్యాచ్ల సిరీస్తో అంతర్జాతీయ కెరీర్కు గుడ్ బై చెప్పబోతున్న డీన్ ఎల్గర్ తన ఆఖరి సిరీస్లో చెలరేగి ఆడుతున్నాడు. సెంచూరియన్ వేదికగా భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో ఎల్గర్ సెంచరీ (140 బంతుల్లో 101, 19 ఫోర్లు)తో కదం తొక్కాడు. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కున్న ఎల్గర్.. శతకంతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్లో భారత్ చేసిన 245 పరుగుల స్కోరును దక్షిణాఫ్రికా కరిగిస్తోంది. 45 ఓవర్ల ఆట ముగిసేసరికి దక్షిణాఫ్రికా.. మూడు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ఎల్గర్ (107 నాటౌట్), బెడింగ్హమ్ (28 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్లో ఆరంభంలోనే ఎయిడెన్ మార్క్రమ్ (5) వికెట్ తీసిన తర్వాత భారత బౌలర్లు తేలిపోయారు. రెండో వికెట్కు ఎల్గర్.. టోనీ డి జోర్జి (28) లు 93 పరుగులు జోడించారు. ఈ జోడీని ఎట్టకేలకు బుమ్రా విడదీశాడు. వరుస ఓవర్లలో బుమ్రా.. జోర్జి, కీగన్ పీటర్సన్ (2)ను ఔట్ చేశాడు.
భారత బ్యాటర్లకు చుక్కలు చూపించిన పిచ్పై సఫారీ బౌలర్లు చెలరేగిపోగా టీమిండియా పేసర్లు మాత్రం అందకు విరుద్ధంగా బౌలింగ్ చేస్తున్నారు. బుమ్రా, సిరాజ్ కాస్త ఫర్వాలేదనిపించినా శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణలు వికెట్లు తీయకపోగా ధారాళంగా పరుగులిస్తున్నారు. 10 ఓవర్లు వేసిన ప్రసిధ్.. 51 పరుగులు సమర్పించుకోగా శార్దూల్ కూడా ఏడు ఓవర్లలో 34 రన్స్ ఇచ్చాడు. భారత బౌలర్ల వైఫల్యాన్ని ఎల్గర్ సొమ్ము చేసుకుంటున్నాడు. ఠాకూర్ వేసిన 22వ ఓవర్లో బౌండరీ కొట్టి 79 బంతుల్లో అర్థ సెంచరీ చేసిన ఎల్గర్.. అతడే వేసిన 43వ ఓవర్లో తొలి బంతికి మిడ్ వికెట్ దిశగా ఆడి సెంచరీని పూర్తిచేసుకున్నాడు. టెస్టులలో అతడికి ఇది 14వ సెంచరీ.