స్టాక్హోమ్: మైదానంలో చిరుతల్లా కదిలిన భారత అమ్మాయిలు మ్యాచ్ ఆద్యంతం ఆధిపత్యం కనబర్చినా.. పొరపాటున సెల్ఫ్ గోల్ వేయడంతో చివరకు పరాజయం పాలయ్యారు. గురువారం స్టాక్హోమ్ వేదికగా.. స్వీడన్ ఫుట్బాల్ హమ్మర్బే ఐఎఫ్ క్లబ్తో జరిగిన స్నేహపూర్వక మ్యాచ్లో భారత మహిళల జట్టు 2-3తో ఓడింది. భారత్ తరఫున ఇందుమతి (30వ నిమిషంలో), మనీషా (40వ ని.లో) చెరో గోల్ కొట్టగా.. స్వీడన్ క్లబ్ తరఫున నీనా జాకబ్సన్ (36వ ని.లో), అమండా సాండ్స్ట్రోమ్ (52వ ని.లో) ఒక్కో గోల్ నమోదు చేశారు. మరో 12 నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా భారత ప్లేయర్ రంజనా చాను సెల్ఫ్ గోల్ కొట్టడంతో.. ప్రత్యర్థి జట్టు విజేతగా నిలిచింది. ఫలితం నిరాశ కలిగించినా ఈ పోరులో భారత అమ్మాయిలు చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.