కైరో: ప్రతిష్ఠాత్మక ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ చాంపియన్షిప్లో భారత యువ షూటర్ ఇషాసింగ్ అదరగొట్టింది. టోర్నీ ఏదైనా పతకం పక్కా అన్న రీతిలో మన షూటర్లు పతక బోణీ కొట్టారు. గురువారం జరిగిన మహిళల 25మీటర్ల పిస్టల్ టీమ్ జూనియర్ విభాగంలో ఇషాసింగ్, నామ్య కపూర్, విభూతి భాటియాతో కూడిన భారత త్రయం 17-1తేడాతో జర్మనీపై అలవోక విజయంతో కాంస్య పతకం సొంతం చేసుకుంది.
అంతకుముందు జరిగిన అర్హత రౌండ్లో 856 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచిన భారత్…కాంస్య పతక పోరులో జర్మనీపై పైచేయి సాధించింది. ఇదే విభాగంలో చైనాకు స్వర్ణం, కొరియాకు రజతం దక్కాయి. మరోవైపు మహిళల 50మీటర్ల రైఫిల్ ప్రోన్ జూనియర్ విభాగంలో నిశ్చల్(616.9), నూపుర్ కుమ్రావత్(606.6) నిరాశపరిచారు. పురుషుల జూనియర్ కేటగిరీలో సూర్యప్రతాప్సింగ్, పంకజ్ ముకేజా తదుపరి రౌండ్కు అర్హత సాధించలేకపోయారు.