ముంబై: తెలంగాణ యంగ్ ప్లేయర్ గొంగడి త్రిష ఆల్రౌండ్ మెరుపులు మెరిపించడంతో న్యూజిలాండ్ అండర్-19 జట్టుపై భారత అండర్-19 జట్టు ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం జరిగిన రెండో టీ20లో భారత అమ్మాయిలు 110 పరుగుల తేడాతో గెలిచారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 రన్స్ చేసింది. త్రిష (36; 4 ఫోర్లు, ఒక సిక్సర్), శ్వేత షరావత్ (34), సౌమ్య తివారీ (31) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ అండర్-19 జట్టు 66 పరుగులకు ఆలౌటైంది. గెర్కెన్ (14), ఇసాబెల్లా (17) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. భారత బౌలర్లలో హర్లీ, అర్చన చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. త్రిషకు ఒక వికెట్ దక్కింది. సిరీస్లో 2-0తో ఆధిక్యం సాధించిన మన అమ్మాయిలు గురువారం మూడో టీ20 ఆడనున్నారు.