న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ వరుస విజయాల పరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరైనా గెలుపే లక్ష్యంగా దూసుకెళుతున్న తెలంగాణ షాన్ నిఖత్ మెగాటోర్నీలో పతకం పక్కా చేసుకుంది. బుధవారం ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన 50 కిలోల క్వార్టర్స్ బౌట్లో నిఖత్ 5-2 తేడాతో చుతామత్ రక్సాత్(థాయ్లాండ్)పై అద్భుత విజయం సాధించింది. మొదటి నుంచే తనదైన దూకుడు కనబరిచిన నిఖత్..ప్రత్యర్థికి ఎక్కడా అవకాశమివ్వకుండా చెలరేగింది.
రెండు సార్లు ప్రపంచ చాంపియన్ కాంస్య విజేత అయిన థాయ్ బాక్సర్పై కచ్చితమైన పంచ్లతో విరుచుకుపడుతూ కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుంది. సెమీస్లో రియో ఒలింపిక్స్ కాంస్య విజేత ఇంగ్రిట్ వాలెన్సియా(కొలంబియా)తో జరీన్ గురువారం తలపడుతుంది. మిగతా బౌట్లలో నీతూ గంగాస్(48కి), సవీటి బూర(81కి), లవ్లీనా బొర్గోహై(75కి)క్వార్టర్స్లో ప్రత్యర్థులపై విజయాలతో సెమీస్లోకి ప్రవేశించారు. మరోవైపు సాక్షి చౌదరి(52కి), మనీశా మౌన్(57కి), జాస్మిన్ లాంబోరియా(60కి), నుపూర్ షెరాన్(81కి) ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించారు. గురువారం టోర్నీలో సెమీస్ బౌట్లు జరుగుతాయి.