లండన్: ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్టు యజమాని కావ్యా మారన్ మరో వివాదంలో చిక్కుకుంది. బ్రిటన్లో జరిగే ‘ది హండ్రెడ్ లీగ్’ కోసం గాను తొలిసారిగా నిర్వహించిన వేలంలో సన్రైజర్స్ లీడ్స్ జట్టు.. పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రర్ అహ్మద్ను కొనుగోలు చేయడం వివాదాస్పదమైంది. వేలంలో అబ్రర్ కోసం ట్రెంట్ రాకెట్స్తో పోటీపడి మరీ రూ. 2.34 కోట్లతో అతడిని దక్కించుకోవడం కొత్త వివాదానికి దారితీసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ లీగ్స్లో ఫ్రాంచైజీలను కల్గిఉన్న ఐపీఎల్ జట్లు.. పాకిస్థాన్ ఆటగాళ్లను పట్టించుకోవడం లేదు. హండ్రెడ్లోనూ ఇదే సంప్రదాయం కొనసాగుతుందని వార్తలు వచ్చిన వేళ.. కావ్యా చేసిన పని ఆమెను కొత్త చిక్కుల్లో పడేసింది. సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా 2009 నుంచి ఐపీఎల్లో పాక్ ఆటగాళ్లపై నిషేధం కొనసాగుతున్నది..
అబ్రర్ను సన్రైజర్స్ దక్కించుకోవడంతో సోషల్ మీడియాలో ఎస్ఆర్హెచ్ జట్టుతో పాటు కావ్యా మారన్పై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారత్తో ఆసియా కప్ సందర్భంగా మ్యాచ్ ఆడుతూ అబ్రర్ చేసిన అభ్యంతకర సంజ్ఞలు, ఆపరేషన్ సింధూర్ సమయంలో టీ కప్పును చూపిస్తూ పాల్పడిన వెకిలి చేష్టలను ప్రస్తావిస్తూ సన్రైజర్స్ యాజమాన్యంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎక్స్లో #బ్యాన్ఎస్ఆర్హెచ్ ట్రెండింగ్లోకి రావడం గమనార్హం. ఒకవేళ సన్రైజర్స్ గనుక ఈ నిర్ణయాన్ని మార్చుకోకుంటే రాబోయే ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ ఆడే ఒక్క మ్యాచ్ను కూడా చూడబోమంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా హండ్రెడ్ వేలంలో యువ ఇంగ్లిష్ ఆటగాడు జేమ్స్ కోల్ప్ జాక్పాట్ కొట్టాడు. లండన్ స్పిరిట్ జట్టు అతడిని రూ. 4.8 కోట్ల రికార్డు ధరకు దక్కించుకుంది.