టోక్యో: ఇండియాకు ప్రతి ఒలింపిక్స్లోనూ పెద్దగా అంచనాలు లేని అథ్లెట్లు మెడల్స్ తీసుకురావడం ఆనవాయితీగా మారింది. ఈ ఒలింపిక్స్( Tokyo Olympics )లో ఇప్పటికే అలా బాక్సర్ లవ్లీనా, రెజ్లర్ రవి దహియా, హాకీ మెన్స్ టీమ్ మెడల్స్ తీసుకొచ్చాయి. ఇప్పుడు ఈ లిస్ట్లో గోల్ఫర్ అదితి అశోక్ కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండోసారి ఒలింపిక్స్లో పాల్గొంటున్న ఈ 23 ఏళ్ల గోల్ఫర్ మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లేలో శుక్రవారం మూడో రౌండ్ ముగిసే సమయానికి రెండో స్థానంలో నిలిచి మెడల్ వేటలో కొనసాగుతోంది.
శుక్రవారం 5 బర్డీస్ (1-అండర్ పార్)తో ఆమె రెండో స్థానంలో నిలిచింది. ఆమె కంటే ముందు వరల్డ్ నంబర్ వన్ గోల్ఫర్ నెల్లీ కోర్డా ఉంది. గత మూడు రోజులుగా ఆమె నిలకడగా రాణిస్తోంది. శనివారం చివరిదైన నాలుగో రౌండ్లో ఇదే నిలకడ కొనసాగిస్తే ఆమె మెడల్ ఖాయం చేసుకుంటుంది. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుఝామున 3 గంటలకే ఈ నాలుగో రౌండ్ ప్రారంభమవుతుంది.