AFC Asian Cup 2024: ఖతార్ వేదికగా జరుగుతున్న ఎఎఫ్సి (ఆసియన్ ఫుట్బాల్ సమాఖ్య) ఏసియన్ కప్-2024ను భారత ఫుట్బాట్ జట్టు ఓటమితో ప్రారంభించింది. అల్ రయన్ లోని అహ్మద్ బిన్ అలీ స్టేడియంలో శనివారం ఆస్ట్రేలియాతో ముగిసిన మ్యాచ్లో భారత్.. 0-2 తేడాతో మ్యాచ్ ఓడిపోయింది. తొలి అర్థ భాగంలో గోల్స్ కోసం పోరాడటమే గాక ప్రత్యర్థి ఆటగాళ్లను సమర్థవంతంగా అడ్డుకున్న భారత ఆటగాళ్లు రెండో హాఫ్లో ఆస్ట్రేలియా ప్లేయర్లు రెండు గోల్స్ కొట్టడంతో ఓటమి పాలయ్యారు. ఆస్ట్రేలియా తరఫున 50వ నిమిషంలో జాక్సన్ ఇర్విన్, 73వ నిమిషంలో జోర్డాన్ బ్రోస్లు తలా ఓ గోల్ చేసి ఆసీస్ను విజేతగా నిలిపారు.
గ్రూప్-బిలో ఉన్న భారత్.. 2015 ఛాంపియన్లతో జరిగిన మ్యాచ్లో భాగంగా ఫస్టాఫ్లో పలుమార్లు గోల్స్ చేసే అవకాశం ఉన్నా వాటిని చేజార్చుకుంది. కానీ ఆస్ట్రేలియా ఆటగాళ్లు వాటిని అడ్డుకున్నారు. ప్రత్యర్థి ఆటగాళ్లు కూడా పలుమార్లు గోల్స్ చేసేందుకు యత్నించినా భారత్ వాటిని అడ్డుకుంది. కానీ రెండో హాఫ్ మొదలైన ఐదు నిమిషాలకు జాక్సన్ ఇర్విన్ ఆసీస్కు తొలి గోల్ కొట్టాడు. గురుప్రీత్ గోల్ను అడ్డుకునేందుకు యత్నించి విఫలమయ్యాడు. ఇక ఆట మరికొద్దిసేపట్లో ముగుస్తుందనగా జోర్డాన్ మరో గోల్తో ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని మరింత పెంచాడు.
Blood and sweat. We gave it our all. But it wasn’t enough to get something from our #AsianCup2023 opener.
On to the next one in five days’ time 🇮🇳#AUSvIND ⚔️ #BlueTigers 🐯 #IndianFootball ⚽ pic.twitter.com/Cptx158KNp
— Indian Football Team (@IndianFootball) January 13, 2024
ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్ను ఈనెల 15న ఇరాక్తో ఆడనుంది. 24 జట్లు ఆరు గ్రూపులుగా విడిపోయి ఆడుతున్న ఈ టోర్నీలో ప్రతి గ్రూపులో టాప్-2లో ఉన్న జట్లతో పాటు మూడో స్థానంలో నిలిచే నాలుగు బెస్ట్ టీమ్స్ కూడా నాకౌట్స్కు అర్హత సాధిస్తాయి. జనవరి 25 వరకు గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు జరుగనుండగా జనవరి 28 నుంచి నాకౌట్ దశ మొదలవుతుంది. ఫిబ్రవరి 2 నుంచి క్వార్టర్స్, ఫిబ్రవరి 6న సెమీస్ జరిగే ఈ టోర్నీలో ఫిబ్రవరి 10న ఫైనల్ జరుగుతుంది.