న్యూఢిల్లీ: ఐబీఏ జూనియర్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత మహిళా బాక్సర్లు పాయల్, నిషా, అకాంక్ష సత్తాచాటారు. మంగళవారం చివరి రోజు ఇండియాకు మూడు స్వర్ణాలు సాధించిపెట్టి మహిళల జట్టును సంయుక్తంగా రెండో స్థానంలో నిలబెట్టారు. అర్మీనియాలోని ఎరెవాన్లో జరిగిన ఈ టోర్నీలో భారత జట్టు మొత్తంగా మూడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, అయిదు కాంస్యాలు సాధించింది. బాలికల 48 కిలోల విభాగంలో పాయల్ భారత్కు తొలి స్వర్ణం అందించింది. ఫైనల్లో పాయల్ స్థానిక బాక్సర్ పెట్రోస్యన్ హెజిన్ను చిత్తుగా ఓడించింది.
అనంతరం ఆసియా యూత్ చాంపియన్లు నిషా, ఆకాంక్ష అంచనాల మేరకు రాణించి మరో రెండు స్వర్ణాలు సాధించారు. 52 కిలోల విభాగంలో నిషా తజకిస్తాన్కు చెందిన అబ్దులయెవ ఫిరనోజ్పై, 70 కిలోల విభాగంలో ఆకాంక్ష రష్యాకు చెందిన తైమజొవ ఎలిజవెతపై 5-0 స్కోరుతో విజయం సాధించి విజేతలుగా నిలిచారు. చివరిరోజు మరో ముగ్గురు మహిళా బాక్సర్లు విని (57కి.), సృష్టి (63కి.), మేఘ (80కి.) ఫైనల్లో పరాజయంపాలై రజతాలతో సంతృప్తి చెందారు. పురుషుల విభాగంలో సాహిల్ (75కి.), హేమంత్ (80ప్లస్ కి.) ఫైనల్స్లో 1-4 తేడాతో పరాజయంపాలై రజతాలతో సంతృప్తి చెందారు.