న్యూఢిల్లీ: భారత జట్టులో పోటీ అధికంగా ఉండటం వల్ల ప్రతీ ఒక్కరూ తమ సమయం వచ్చేంత వరకు వేచి చూడక తప్పదని టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు. గురువారం నుంచి దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుండగా.. ఇరు జట్లు ప్రాక్టీస్లో నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘మూడు ఫార్మాట్లలో ఆడుతున్న ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చినా.. ప్రస్తుతం జట్టులో తగినంత మంది ఉన్నారు. అందరికీ తుది జట్టులో అవకాశం దక్కడం కష్టమే. నిలకడ కొనసాగించే ప్లేయర్లకు ప్రాధాన్యతనిస్తాం. అర్శ్దీప్, ఉమ్రాన్ మాలిక్ తమ నైపుణ్యంతో ఆకట్టుకున్నా.. సమయం వచ్చేంత వరకు వేచి చూడక తప్పదు.
పేస్ విభాగంలో అనుభవజ్ఞులైన భువనేశ్వర్, అవేశ్, హర్షల్ అందుబాటులో ఉన్నారు. రిజర్వ్ బెంచ్లో కూడా సత్తా ఉన్న ఆటగాళ్లు ఉండటం జట్టుకు లాభిస్తుంది’ అని అన్నాడు. ఐపీఎల్ వల్ల దేశీ ఆటగాళ్లకు అంతర్జాతీయ అనుభవం లభిస్తోందన్న రాహుల్ ద్రవిడ్.. జట్టులో ఎక్కువ మందికి సారథ్య అనుభవం ఉండటం మంచిదే అని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ గైర్హాజరీలో సఫారీలతో సిరీస్కు కేఎల్ రాహుల్ కెప్టెన్గా వ్యవహరించనుండగా.. శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ వంటి వారికి ఐపీఎల్లో నాయకత్వం వహించిన అనుభవం ఉన్న విషయం తెలిసిందే. పూర్తి ఫిట్నెస్తో హార్దిక్ పాండ్యా తిరిగి రావడం సంతోషంగా ఉందన్న మిస్టర్ డిపెండబుల్.. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడు ప్రమాదకర ఆటగాడని పేర్కొన్నాడు.
టాప్ త్రీ కీలకం..
టీమ్ఇండియా టాప్-3 ఆటగాళ్లు చాలా కీలకమనే విషయం ప్రతీ ఒక్కరికీ తెలుసని రాహుల్ ద్రవిడ్ గుర్తు చేశాడు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ.. ఎలాంటి పరిస్థితుల్లో నుంచైనా మ్యాచ్ను గెలిపించగల సత్తా ఉన్నవాళ్లని అన్నాడు. ‘ఆ ముగ్గురు టాప్ క్లాస్ ఆటగాళ్లు. ఈ సిరీస్కు అందుబాటులో లేకపోయినా.. సుదీర్ఘ ప్రయోజనాల దృష్టితో చూడాలి. కొన్ని సార్లు పరిస్థితులు కఠినంగా ఉంటాయి. అలాంటి సమయంలో స్ట్రయిక్ రేట్ను కొనసాగించడంతో పాటు.. వికెట్లు పడకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు. జట్టులో ఎవరి బాధ్యత ఏంటనే దానిపై అందరికీ స్పష్టమైన అవగాహన ఉందని ‘ది వాల్’ చెప్పాడు. ఇంగ్లండ్ వేదికగా టెస్టు మ్యాచ్ ఆడాల్సి ఉండటంతోనే మూడు ఫార్మాట్లు ఆడుతున్న ప్లేయర్లకు విశ్రాంతినిచ్చామని ద్రవిడ్ స్పష్టతనిచ్చాడు.
టికెట్లు ఖతం..
భారత్, దక్షిణాఫ్రికా మధ్య గురువారం ఢిల్లీలో జరుగనున్న మొదటి టీ20కి అందుబాటులో ఉన్న టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. 34 వేల మంది సామర్థ్యం గల అరుణ్ జైట్లీ మైదానంలో 94 శాతం సీట్లు బుక్ అయ్యాయని డీడీసీఏ కార్యదర్శి రాజన్ తెలిపారు. సీనియర్ సిటిజన్లు మైదానంలో ప్రవేశించడానికి గోల్ఫ్ కార్ట్ను ఉపయోగించుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు.