గోల్డ్కోస్ట్: భారత్, ఆస్ట్రేలియా మహిళలు ప్రతిష్ఠాత్మక పోరుకు సిద్ధమయ్యారు. పదిహేను ఏండ్ల తర్వాత టెస్టు సమరంలో తలపడబోతున్నారు. ఇరు జట్ల మధ్య గులాబీ బంతితో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ గురువారం నుంచి మొదలవుతుంది. మిథాలీరాజ్ సారథ్యంలోని భారత్.. తొలిసారి ఫ్లడ్ లైట్ల వెలుతురులో గులాబీ బంతితో ఆడబోతుండగా, ఆసీస్కు ఇది రెండో టెస్టు. పరిమిత ఓవర్ల సిరీస్ను 1-2తో ఆసీస్కు చేజార్చుకున్న మిథాలీసేన.. ఏకైక టెస్టులో సత్తాచాటాలని చూస్తున్నది. స్టార్ బ్యాటర్ హర్మన్ప్రీత్కౌర్ గాయం కారణంగా టెస్టుకు దూరం కాగా, వన్డేల్లో ఆకట్టుకున్న యస్తికా భాటియా, మేఘన సింగ్ టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశముంది. జులన్ గోస్వామి, మేఘన, పూజ వస్ర్తాకర్ పేస్ దళాన్ని నడిపించనున్నారు. దీప్తిశర్మతో కలిసి స్నేహ్ రాణా ఆల్రౌండర్గా తుది జట్టుకు ఎంపిక కానుంది. రిచా ఘోష్ స్థానంలో వికెట్కీపర్గా తానియా భాటియా జట్టులోకి రానుంది. మరోవైపు కండరాల గాయంతో ఆసీస్ వైస్ కెప్టెన్ రాచెల్ హేన్స్ టెస్టుకు దూరం కాగా, వన్డేల్లో రాణించిన అన్నాబెల్ సదర్లాండ్కు అవకాశం లభించనుంది. మొత్తంగా ఆసీస్ పేసర్లకు భారత బ్యాటర్లకు మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశం కనిపిస్తున్నది.