ప్రపంచ టెస్టు చాంపియన్ను క్లీన్స్వీప్ చేసి జోరు మీదున్న జట్టు ఓ వైపు..తుది జట్టును ఎంపిక చేసేందుకే ఆపసోపాలు పడుతున్న టీమ్ మరో వైపు!!కెప్టెన్సీ చేతులు మారిన తర్వాత మరింత రాటుదేలింది ఒకరైతే..ఏడాదిలోపు ఎనిమిది మంది సారథులను ప్రయత్నించింది మరొకరు!!సుదీర్ఘ ఫార్మాట్లో సంచలనాలు సృష్టిస్తున్నది ఒక జైట్టెతే..సీనియర్ల గైర్హాజరీలో సత్తాచాటాలని చూస్తున్నది మరో జట్టు!!
భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదో (రీ షెడ్యూల్) టెస్టుకు సమయం ఆసన్నమైంది. గతేడాది కరోనా కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన సిరీస్లోని ఆఖరి పోరులో ఇంగ్లిష్ జట్టుతో టీమ్ఇండియా అమీతుమీకి రెడీ అయింది. అప్పటికి ఇప్పటికి సారథులతో సహా ఇరు జట్లు పూర్తిగా మారిపోగా.. ఆతిథ్య ఇంగ్లండ్ ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. రోహిత్ శర్మకు మరోసారి కరోనా పాజిటివ్ అని తేలడంతో భారత జట్టుకు బుమ్రా సారథ్యం వహిస్తుండగా.. ఇటీవల న్యూజిలాండ్ను వైట్ వాష్ చేసిన ఇంగ్లిష్ టీమ్ అదే దూకుడు కొనసాగిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. కనీసం ఈ టెస్టును ‘డ్రా’ చేసుకున్నా సిరీస్ చేజిక్కించుకునే చాన్స్ టీమ్ఇండియాను ఊరిస్తున్నది!
బర్మింగ్హామ్: కరోనా కారణంగా అర్ధాంతరంగా ముగిసిన సిరీస్.. తిరిగి కరోనా మధ్యే ప్రారంభమవుతున్నది. ఐదు మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు గతేడాది ఇంగ్లండ్ వెళ్లిన టీమ్ఇండియా.. నాలుగు టెస్టులు ఆడాక 2-1తో ఆధిక్యంలో ఉన్న సమయంలో కరోనా కలకలం రేగడంతో సిరీస్ను మధ్యలోనే ముగించింది. అప్పుడు మిగిలిపోయిన ఆఖరి టెస్టు.. ఎడ్జ్బాస్టన్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. అప్పటికి ఇప్పటికి పరిస్థితులు, సారథులు మారిపోగా.. సిరీస్ పట్టాలని టీమ్ఇండియా, సమం చేయాలని ఇంగ్లండ్ తహతహలాడుతున్నాయి.
విరాట్ కోహ్లీ నుంచి సారథ్య బాధ్యతలు అందుకున్న రోహిత్ శర్మ కరోనా బారిన పడటంతో ఈ మ్యాచ్కు ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సారథిగా వ్యవహరించనున్నాడు. హర్యానా హరికేన్ కపిల్దేవ్ తర్వాత భారత జట్టు పగ్గాలు అందుకున్న తొలి పేస్ బౌలర్గా బుమ్రా రికార్డుల్లోకెక్కనున్నాడు. మ్యాచ్ ఆరంభానికి ఒక రోజు ముందే ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించగా.. 9 నెలల క్రితం జరిగిన నాలుగో టెస్టులో ఆడిన నలుగురు ఆటగాళ్లు మాత్రమే ప్రస్తుత టీమ్లో చోటు దక్కించుకున్నారు. టీమ్ఇండియా తరఫున సీనియర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, అజింక్యా రహానే అందుబాటులో లేరు.
ఈ మ్యాచ్ను ‘డ్రా’ చేసుకున్నా టీమ్ఇండియా సిరీస్ చేజిక్కించుకుంటుంది. ఇప్పటి వరకు జరిగిన నాలుగు మ్యాచ్ల్లో భారత్ 2-1తో ముందంజలో ఉంది.
పిచ్, వాతావరణం
పిచ్ పచ్చికతో నిండి ఉంది. గతంతో పోల్చుకుంటే ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ వికెట్లు కాస్త స్పిన్నర్లకు సహకరిస్తున్నాయి. తొలి రెండు రోజులు మ్యాచ్కు వర్షం అడ్డుపడొచ్చు
జట్లు
భారత్ (అంచనా): బుమ్రా (కెప్టెన్), గిల్, పుజారా, విహారి, కోహ్లీ, శ్రేయస్, పంత్, జడేజా, శార్దూల్/అశ్విన్, షమీ, సిరాజ్.
ఇంగ్లండ్: స్టోక్స్ (కెప్టెన్), లీస్, క్రాలీ, పోప్, రూట్, బెయిర్స్టో, బిల్లింగ్స్, పాట్స్, బ్రాడ్, అండర్సన్, లీచ్.
సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటా. భారత జట్టుకు సారథ్యం వహించడానికి ముందు ధోనీ ఏ స్థాయిలోనూ కెప్టెన్గా వ్యవహరించలేదని చెప్పిన మాటలు ఇంకా గుర్తే. అందుకే నాయకత్వాన్ని భారంగా భావించడం లేదు. జట్టుకు ఏవిధంగా సాయపడగలనో అదే చేస్తా. జాతీయ జట్టు తరఫున టెస్టు మ్యాచ్ ఆడటమే ఒక కలైతే.. అందులో సారథ్యం వహించడమనేది ఎప్పటికీ మరువలేని విషయం. ఈ అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.
-బుమ్రా, భారత కెప్టెన్
1 ఎడ్జ్బాస్టన్లో టీమ్ఇండియా ఇంతవరకు ఒక్క టెస్టు కూడా నెగ్గలేదు. ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఆరింట ఓడి ఒకదాన్ని ‘డ్రా’ చేసుకుంది.
2 ఇంగ్లండ్తో ఒకే సిరీస్లో టీమ్ఇండియా మూడు టెస్టులు ఇంతవరకు నెగ్గలేదు. రెండు (1986, 2021) పర్యటనల్లో మాత్రమే రెండేసి మ్యాచ్లు గెలిచింది.
1 దిగ్గజ కెప్టెన్ కపిల్దేవ్ తర్వాత భారత జట్టుకు సారథ్యం వహించనున్న పేస్ బౌలర్గా బుమ్రా చరిత్రకెక్కనున్నాడు. ఓవరాల్గా అనిల్ కుంబ్లే తర్వాత టీమ్ఇండియాకు సారథ్యం వహించనున్న బౌలర్ బుమ్రానే.