SAFF Championship | ఖాట్మండు (నేపాల్): దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (శాఫ్) అండర్-20 చాంపియన్షిప్ సెమీస్లో భారత్కు భంగపాటు ఎదురైంది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత్కు సెమీస్లో బంగ్లాదేశ్ షాకిచ్చింది. సెమీస్లో స్కోర్లు 1-1తో సమం కాగా పెనాల్టీ షూటౌట్ ద్వారా తేలిన ఫలితంలో బంగ్లాదేశ్ 4-3తో భారత్ను ఓడించి ఫైనల్స్కు దూసుకెళ్లింది. బంగ్లాదేశ్ ఆటగాడు అసదుల్ ఇస్లాం సకిబ్ 36వ నిమిషంలో గోల్ చేయగా భారత్ తరఫున రికీ మెటీ హోబమ్ 74వ నిమిషంలో గోల్ కొట్టి స్కోర్లను సమం చేశాడు. పెనాల్టీలలో భారత్ మూడు గోల్స్ మాత్రమే చేయగా బంగ్లా 4 గోల్స్ సాధించింది. ఆట ఆరంభంలోనే రెండు పెనాల్టీలను వదిలేసుకున్న భారత్ అందుకు తగిన మూల్యం చెల్లించుకుంది. బుధవారం జరుగబోయే ఫైనల్స్లో బంగ్లాదేశ్.. నేపాల్తో అమీతుమీ తేల్చుకోనుంది.
హోరాహోరీగా టెన్నిస్ టోర్నీ
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని న్యూ డైమెన్షన్ టెన్నిస్ అకాడమీలో రాజనర్సింహారావు స్మారక ఐటీఎఫ్ వరల్డ్ జూనియర్స్ అండర్ -18 టెన్నిస్ పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం బాల బాలికల విభాగాల్లో సింగిల్స్ క్వాలిఫయింగ్ మ్యాచ్లు జరుగగా, మధ్యాహ్నం తర్వాత మెయిన్ డ్రా ఫస్ట్ రౌండ్ కొనసాగింది. బాలికల క్వాలిఫయింగ్ సింగిల్స్లో రంగినేని కీర్తన 6-0, 7-5తో అరవింద్ మీరా(ఆస్ట్రేలియా)పై, శాన్వి మిశ్రా 2-6, 6-0, 12-10తో సావర్ణిక విసనకపై గెలిచారు.
మెయిన్ డ్రాస్ ఫస్ట్ రౌండ్ సింగిల్స్లో వామికా శర్మ 6-3,6-2తో పల్లవి మిస్త్రిపై, సౌమిత్రి చటర్జీ 6-0, 6-0 తో శ్రీనిధి సాయిపై విజయం సాధించింది. బాలుర సెకండ్ రౌండ్ సింగిల్స్ క్వాలిఫయింగ్లో అభిరాం 6-1, 6-2తో సిద్ధార్థపై, మోక్షత్ రెడ్డి 6-0, 6-0తో ప్రత్యుష్పై ఘన విజయం సాధించారు. బాలుర ఫైనల్ క్వాలిఫయింగ్లో అక్షత్ 7-6, 6-1తో అభిరామ్పై పై చేయి సాధించాడు. బాలుర మెయిన్ డ్రా ఫస్ట్రౌండ్ సింగిల్స్ లో అంకిత్ రాయ్ 6-4, 7-6తో మాన్యురెడ్డి తోట(యూఎస్ఏ)పై గెలిచాడు. మంగళవారం మెయిన్ డ్రా ఫస్ట్ రౌండ్ పూర్తయ్యాక, సెకండ్ రౌండ్ ప్రారంభం కానుంది. వచ్చే నెల ఒకటో తేదీ వరకు ఈ పోటీలు జరుగనున్నాయి.