దంబుల్లా: ఆల్రౌండ్ ప్రదర్శనతో ఇప్పటికే సిరీస్ పట్టేసిన భారత మహిళల జట్టు.. సోమవారం నామమాత్రమైన మూడో టీ20లో శ్రీలంకతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. వచ్చే నెలలో బర్మింగ్హామ్ వేదికగా జరుగనున్న కామన్వెల్త్ క్రీడల్లో బరిలోకి దిగే ముందు ఈ ఫార్మాట్లో టీమ్ఇండియాకు ఇదే చివరి మ్యాచ్ కానుండగా.. జట్టు కూర్పు విషయంలో ఒక అంచనాకు రావాలని మేనేజ్మెంట్ భావిస్తున్నది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధన, షఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, జెమీమా రోడ్రిగ్స్, యస్తిక భాటియా బ్యాటింగ్లో కీలకం కానున్నారు. వీరంతా సమిష్టిగా రాణిస్తే టీమ్ఇండియాకు తిరుగుండదు. బౌలింగ్లో దీప్తి శర్మ, రాధ యాదవ్పై భారీ అంచనాలు ఉన్నాయి. దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన అనంతరం జరుగుతున్న తొలి సిరీస్లో చక్కటి ప్రదర్శన కనబర్చుతున్న మన అమ్మాయిలు అదే జోష్లో ప్రత్యర్థిని క్లీన్స్వీప్ చేయాలని తహతహలాడుతున్నారు.