Sanjay Manjrekar | ఫామ్లో లేని సీనియర్లను పక్కన బెట్టి యువ క్రికెటర్లకు అవకాశాలు కల్పించాలని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు. జట్టు ఎంపికలోనే లోపాలు ఉన్నాయన్నాడు. సఫారీల చేతిలో టీం ఇండియా ఘోర పరాజయం పాలవ్వడంపై విమర్శలు ఎక్కుపెట్టాడు. దక్షిణాఫ్రికాకు వెళ్లే జట్టు ఎంపికలోనే పెద్ద లోపం ఉందన్నాడు. అనుభవం, ఫామ్లో లేని ఆటగాళ్లను ఎంపిక చేశారన్నాడు. మిడిలార్డర్లో సత్తా చాటే సామర్థ్యం గల ప్లేయర్లను సిద్ధం చేయాలని సూచించాడు.
వన్డే మ్యాచ్లో ఓపెనింగ్ చాలా తేలిక.. ఓపెనర్లు సెంచరీలు, హాఫ్ సెంచరీలు చేసినా లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ చేసే క్రికెటర్లపైనే విజయం ఆధార పడి ఉంటుందన్నాడు. దక్షిణాఫ్రికా టూర్లో అదే కనిపించిందని చెప్పాడు. మెరుగ్గా శుభారంభాన్నిచ్చినా స్వల్ప వ్యవధిలో కీలక వికెట్లు కోల్పోవడంతో టీం ఇండియా వెనుక బడిందన్నాడు.
టీం ఇండియా బౌలింగ్ విభాగంలోనూ మార్పులు చేయాలన్నాడు మంజ్రేకర్. సీనియర్ పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ మునుపటి ఫామ్ అందుకోవడం చాలా కష్టమేననిపిస్తున్నదన్నాడు. అతడిస్థానే దీపక్ చహార్ను పూర్తిస్థాయి ప్లేయర్గా తీసుకోవాలి. చివరి వన్డేలో జానెమన్ మలన్ను ఔట్ చేయడానికి దీపక్ చహార్ వేసిన ఒక్క బంతితో అతడు ఎంత నాణ్యమైన బౌలరో తేలుస్తుందన్నాడు. ఇక సీనియర్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్కు ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సి ఉందని మంజ్రేకర్ పేర్కొన్నాడు.