జకార్తా: హాకీ ఆసియా కప్లో భారత్ ఫైనల్కు చేరువైంది. సూపర్-4 స్టేజ్ తొలి పోరులో జపాన్ను మట్టికరిపించిన టీమ్ఇండియా.. ఆదివారం మలేషియాతో జరిగిన రెండో పోరును 3-3తో ‘డ్రా’ చేసుకుంది. భారత్ తరఫున విష్ణుకాంత్ సింగ్ (32వ నిమిషంలో), సునీల్ (53వ ని.లో), నీలమ్ (55వ ని.లో) ఒక్కో గోల్ చేయగా.. మలేషియా తరఫున రహీమ్ (12వ, 21వ, 56వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్తో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం సూపర్-4లో దక్షిణ కొరియా తర్వాత భారత్ రెండో స్థానంలో కొనసాగుతున్నది.
తొలి క్వార్టర్ నుంచే భారత గోల్ పోస్ట్పై దండెత్తిన మలేషియా.. 12వ నిమిషంలో శుభారంభం చేసింది. రెండో క్వార్టర్లో మరో గోల్ వారి ఖాతాలో చేరడంతో అర్ధభాగానికి మలేషియా 2-0తో ఆధిక్యంలో నిలిచింది. మూడో క్వార్టర్లో ఓ గోల్ చేసి ఆధిక్యాన్ని కాస్త తగ్గించిన భారత్.. ఆఖరి క్వార్టర్లో రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి ముందంజ వేసింది. ఇక మ్యాచ్ భారత్ వశమైనట్లే అనుకుంటున్న దశలో మలేషియా ప్లేయర్ రహీమ్ గోల్తో మ్యాచ్ను ‘డ్రా’గా ముగించాడు. ఆఖరి పోరులో మంగళవారం దక్షిణా కొరియాతో టీమ్ఇండియా.. తలపడనుంది.