‘క్యాచెస్ విన్ ది మ్యాచెస్’ నానుడిని మరిచిన టీమ్ఇండియా భారీ మూల్యం చెల్లించుకుంది. చేతిలో పడ్డ బంతులు వదిలేసి బంగ్లాదేశ్తో తొలి వన్డేలో పరాజయం పాలైంది. టాపార్డర్ విఫలమైన చోట ఐదోస్థానంలో బ్యాటింగ్కు దిగి జట్టుకు పోరాడే స్కోరు అందించిన రాహుల్.. వికెట్ కీపర్గా సులువైన క్యాచ్ అందుకోవడంలో విఫలమై టీమ్ఇండియా పరాజయానికి కారణమయ్యాడు.
మీర్పూర్: ఆల్రౌండ్ వైఫల్యంతో బంగ్లాదేశ్తో జరిగిన తొలి వన్డేలో భారత్ పరాజయం పాలైంది. హోరాహోరీగా సాగిన లో స్కోరింగ్ మ్యాచ్లో బంగ్లా వికెట్ తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 41.2 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (73; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. రోహిత్ (27), శ్రేయస్ (24) , సుందర్ (19) తలా కొన్ని పరుగులు చేశారు. శిఖర్ ధవన్ (7), కోహ్లీ (9) విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ 5, ఇబాదత్ 4 వికెట్లు పడగొట్టారు. లక్ష్యఛేదనలో బంగ్లా 46 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 187 రన్స్ చేసింది. కెప్టెన్ లిటన్ దాస్ (41), మెహదీ హసన్ మిరాజ్ (38 నాటౌట్) రాణించారు. సిరాజ్ 3, అరంగేట్ర పేసర్ కుల్దీప్ సేన్, సుందర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మెహదీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. 187 పరుగుల లక్ష్యఛేదనలో 136 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన బంగ్లా.. చివరి వికెట్కు రికార్డుస్థాయిలో 51 పరుగులు జోడించింది. ఈ క్రమంలో మెహదీ ఇచ్చిన సులువైన క్యాచ్ను రాహుల్ వదిలేయగా.. అంతకుముందు రోహిత్, సుందర్ కూడా తేలికైన క్యాచ్లు పట్టడంలో విఫలమయ్యారు. షకీబ్ ఇచ్చిన క్లిష్టమైన క్యాచ్ను కోహ్లీ మెరుపు వేగంతో అందుకోవడం గమనార్హం.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 41.2 ఓవర్లలో 186 ఆలౌట్ (రాహుల్ 73, రోహిత్ 27; షకీబ్ 5/36, ఇబాదత్ 4/47),
బంగ్లాదేశ్: 46 ఓవర్లలో 187/9 (లిటన్దాస్ 41, మెహదీ 38 నాటౌట్; సిరాజ్ 3/32, సుందర్ 2/17).