Ravi Shastri: ఇటీవలే ముగిసిన వన్డే ప్రపంచకప్లో భాగంగా ఫైనల్ పోరులో ఓడి రన్నరప్గా నిలిచిన భారత జట్టు త్వరలోనే వరల్డ్ కప్ గెలుస్తుందని టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి ఆశాభావం వ్యక్తం చేశాడు. వరల్డ్ కప్ గెలవడం అంటే ఆషామాషీ కాదని, సచిన్ అంతటి వాడే ఆరు వన్డే వరల్డ్ కప్లు వేచి చూశాడని వ్యాఖ్యానించాడు. వచ్చే ఏడాది అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్ కప్లో భారత జట్టు ఇతర జట్లకు గట్టి పోటీనిస్తుందని అన్నాడు. వన్డే ప్రపంచకప్లో భారత ఓటమి క్రికెట్ అభిమానులతో పాటు తననూ చాలా వేధించిందని, కానీ టీమిండియా త్వరలోనే వరల్డ్ కప్ గెలుస్తుందని తెలిపాడు.
ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో శాస్త్రి మాట్లాడుతూ.. `ఏదీ అంత ఈజీగా రాదు. సచిన్ టెండూల్కర్ వంటి గొప్ప ఆటగాడు సైతం ఒక వరల్డ్ కప్ కోసం ఆరు టోర్నీలు వేచి చూడాల్సి వచ్చింది. వరల్డ్ కప్ గెలవడం అంత సులభం కాదు. ఆ ట్రోఫీని సొంతం చేసుకోవాలంటే డిసైడింగ్ డే (ఫైనల్) నాడు ఆటగాళ్లు తమలోని అత్యుత్తమ ఆటను వెలికి తీయాలి. మీరు గతంలో ఎలా ఆడారు..? అన్నది ప్రధానం కాదు. ఆరోజు ఎలా ఆడామన్నదే ముఖ్యం. ఆస్ట్రేలియానే తీసుకోండి. వాళ్లు తొలి రెండుమ్యాచ్లలో ఓడినా ఫైనల్లో మెరుగైన ఆట ఆడి మ్యాచ్ను ఏకపక్షంగా మార్చేశారు..`అని అన్నాడు.
వన్డే వరల్డ్ కప్ ఓడినా వచ్చే ఏడాది జరుగబోయే టీ20 వరల్డ్ కప్లో భారత్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉంటుందని, యువ ఆటగాళ్లకు అంచనాలకు మించి రాణిస్తున్నారని కొనియాడాడు. భారత జట్టు పూర్తి ఫోకస్ దానిమీదే ఉండాలని చెప్పాడు. వరల్డ్ కప్ ముగిసి పది రోజులు కూడా కాకముందే యువ భారత జట్టు ఆసీస్ను వరుసగా రెండు మ్యాచ్లలో ఓడించి ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-0తో ముందంజ వేసిన విషయం తెలిసిందే.